ETV Bharat / politics

జగన్​ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే! - LIQUOR in CM Jagan meetings

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 9:17 AM IST

Updated : Apr 20, 2024, 11:34 AM IST

LIQUOR in CM Jagan meetings : మద్యనిషేధం చేసి కానీ 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని ఊదరగొట్టిన ఆయన, ఇప్పుడు మద్యం లేకుండా సభలు పెట్టలేకపోతున్నాడు. ఎన్నికల వేడి ప్రారంభమైన నాటి నుంచి సీఎం సభల్లోనే 20లక్షల బాటిళ్ల మద్యం సరఫరా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకోసం ప్రాంతాల వారిగా వైసీపీ నేతల ఇళ్లలో మద్యం డంప్​లు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో దాడి చేస్తే ఇంకా భారీగా బయటపడే అవకాశముంది.

liquor-_in_cm_jagan_meetings
liquor-_in_cm_jagan_meetings

LIQUOR in CM Jagan meetings : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ, సీఎం జగన్‌ 'మేమంతా సిద్ధం' పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం ప్రజల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కేసుల కొద్దీ మద్యం పొంగిపొర్లుతోంది. సాక్షాత్తూ సీఎం సభల నుంచే చట్ట ఉల్లంఘన మొదలవుతోంది. ఇప్పటివరకూ 'సిద్ధం' సభలు 4, 'మేమంతా సిద్ధం' సభలు 12 నిర్వహించగా ప్రతి సభకు వెయ్యి నుంచి 12 వందల ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తూ దారిలో మద్యం తీసుకొచ్చి లోడ్‌ చేశారు. ప్రతి బస్సులో సుమారు 100 క్వార్టర్‌ సీసాలు తాగించారు. అలా... ఇప్పటివరకూ జరిగిన సభల్లో దాదాపు 20 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. మూడు సీసాలు ఉండటమే చట్టవిరుద్ధమైతే.. అన్ని లక్షల సీసాలు వైకాపా నాయకుల వద్దకు ఎలా చేరాయో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఎన్నికల సంఘానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జగన్‌ సభలకు జనాల్ని తరలిస్తున్న ఏ బస్సులో చూసినా, ఏ సభ వద్దకు వెళ్లినా కేసుల కొద్దీ మద్యం పట్టుబడుతుంది. కానీ ఎందుకు దాడులు చేయట్లేదన్నదే అంతుచిక్కని ప్రశ్న.

పెట్రోలు కూపన్లు తీసుకో - సీఎం బస్సు యాత్రలో రైడ్ వేసుకో! 'సిద్దం' సభకు వైసీపీ కూపన్ల ఎర - CM Jagan Bus Yatra Petrol Coupons

జగన్​ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే!

వైఎస్సార్సీపీ నాయకులు రెండు మార్గాల్లో మద్యం సమకూర్చుకుంటున్నారు. వాసుదేవరెడ్డి ఇటీవలి వరకూ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా కొనసాగడంతో.. ప్రభుత్వ దుకాణాల్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం సమకూర్చుకున్నారు. ఇప్పటికీ ఇది సాగుతోంది. గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సుంకం చెల్లించని మద్యం తెప్పించుకున్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను దాటించి మరీ ఇక్కడికి మద్యం తీసుకొస్తున్నారు. 2014 సమయంలోనే వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారుచేసి పంపిణీ చేశారని అప్పట్లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అధికారంలో లేనప్పుడే అంత పెద్ద ఎత్తున దందా చేసిన నాయకులు.. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా పేట్రేగిపోతున్నారు.

మొన్న దర్శి, నిన్న చిత్తూరు, ఆలమూరు.. తాజాగా నగరి.. రాష్ట్రంలో ఎక్కడికక్కడే వైఎస్సార్సీపీ నాయకుల మద్యం నిల్వలు బయటపడుతున్నాయి. అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో అధికారపార్టీ నాయకులు.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే భారీగా మద్యం సమకూర్చుకున్నారు. వాటిని వారి స్థావరాల్లో నిల్వ చేసుకుని తెప్పించుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి లారీల కొద్దీ మద్యం తెప్పించుకుని నిల్వ చేస్తూ ప్రస్తుతం నామినేషన్ల తరుణంలో బయటకు తెస్తుండటంతో ఈ డంప్‌ల ఉనికి బయటపడుతోంది. వాస్తవంగా వైఎస్సార్సీపీ నాయకుల గోదాములు, ఇతర స్థావరాల్లో ఉన్న మద్యం నిల్వలతో పాటు, వారు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నది పోలిస్తే పోలీసులకు పట్టుబడుతోంది ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం.

సీఎం జగన్​కు జనం కరవు -​ వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra

పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లారీల్లో మద్యం తరలిస్తుంటే ఏ ఒక్కరూ వాటిని నిలువరించకపోవడానికి స్వామి భక్తే కారణమని తెలుస్తోంది. కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్‌రావుకు చెందిన ఇటుకల బట్టీలో 130 బాక్సుల్లో 6 వేల 240 గోవా మద్యం సీసాల డంప్‌ పట్టుబడింది. ఆ సరకు ఏపీకి రావాలంటే 3 రాష్ట్రాల సరిహద్దులు దాటాలి. ఎక్కడా చిక్కకుండా అంత మద్యం ఎలా తెచ్చారు? పుత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడగా.. ఆ కళాశాలలో 250 కేసుల మద్యం నిల్వలు ఉన్నట్లు తేలింది. నగరిలో మంత్రి రోజా నామినేషన్‌ సందర్భంగా మద్యం పంపిణీ చేయడానికి తరలిస్తుండగా ఆ నాయకుడు చిక్కారు. ఇదంతా కర్ణాటక మద్యమే. ిదిలా ఉండగా చిత్తూరు డిప్యూటీ మేయర్‌ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై దాడిచేయగా 170 కేసుల కర్ణాటక మద్యం పట్టుబడింది.

పుత్తూరులో భారీ మద్యం డంప్‌ స్వాధీనం - కేసు నమోదు చేయని అధికారులు ! - liquor dump in chittoor

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా సెబ్‌ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. కారు డ్రైవర్‌ను విచారిస్తే ఈరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంటికి తరలిస్తున్నట్లు తేలింది. అక్కడ తనిఖీ చేయగా 223 మద్యం కేసులు బయటపడ్డాయి. మేడం రమణారెడ్డి ఈ డంప్‌ చేసినట్లు తేలగా అవన్నీ ప్రభుత్వ దుకాణాల నుంచి తరలించినవే కావడం గమనార్హం.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విజయవాడ సీపీ కాంతిరాణాపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు, కర్ణాటక మద్యం వస్తుంటే ఎందుకు నిలువరించట్లేదని అప్పటి అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డిని నిలదీసింది. మద్యం సరఫరా కట్టుదిట్టంగా నిలువరించాలని, సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తరచూ ఆదేశిస్తున్నా అధికార పార్టీతో అంటకాగిన అధికారులు వాటిని లెక్కేచేయలేదు.

వైసీపీ నేత కారు షెడ్డులో అక్రమ మద్యం- స్వాధీనం చేసుకున్న పోలీసులు - illegal liquor in chittoor district

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ముందస్తుగా భారీ ఎత్తున మద్యం నిల్వలు సమకూర్చుకున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే కోరుకున్న చోటకు వారికి కావాల్సినంత మద్యం చేరింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో విక్రయాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో చాలాచోట్ల సరకంతా వైసీపీ నేతలకే చేరుతోంది. విక్రయాలు లేవంటూ మధ్యాహ్నానికే దుకాణాలు మూసేస్తున్నారు.

అధికార పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ మద్యం పంపిణీపై ఆధారపడింది. అధికార యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తే ఈ మద్యం డంప్‌లు భారీగా బయటపడే అవకాశముంది. గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 కోట్ల 71 లక్షల రూపాయల విలువైన 5 లక్షల 59 వేల లీటర్ల మద్యం పట్టుబడింది.

200 ఇచ్చినా, పెట్రోలు కూపన్లు పంచినా - జగన్‌ యాత్రకు 'సిద్ధం'గా లేని జనం - Memantha Siddham Bus Yatra Failed

Last Updated : Apr 20, 2024, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.