ETV Bharat / opinion

రాజకీయాలపై ఈ ముగ్గురు నేతల భార్యల ఫోకస్​- సీఎం పీఠంపైనే గురి! - party president wives on politics

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 5:03 PM IST

Party President Wives Focus on Politics
Party President Wives Focus on Politics

Party President Wives Focus on Politics : ఈసారి లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈనేపథ్యంలో ముగ్గురు మహిళా నేతల గురించి అంతటా చర్చ జరుగుతోంది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేయాలని చూస్తున్నారు. మరొకరు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగారు.

Party President Wives Focus on Politics : ఈసారి ఎన్నికల్లో ముగ్గురు మహిళామణులు కీలకంగా మారారు. భర్తలు జైల్లో ఉన్నా, తమ రాజకీయ పార్టీల బలోపేతం కోసం పట్టుదలతో పోరాడుతున్నారు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్!! ఓ వైపు భర్తల తరఫున కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రజాతీర్పును కోరుతూ జన క్షేత్రంలోనూ అలుపెరగకుండా దూసుకుపోతున్నారు. రానున్న రోజుల్లో వీరిద్దరూ దిల్లీ, ఝార్ఖండ్ సీఎం పీఠాలపై కొలువుతీరినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ సైతం తన మరదలు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేను ఢీకొంటున్నారు.

భార్యాభర్తలిద్దరూ ఐఆర్ఎస్ ఆఫీసర్లే
లిక్కర్ స్కాం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్​ జైలులో ఉన్నారు. ఈ పరిణామాలతో అరవింద్ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని వీడియో సందేశాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క ఆప్ నేత కూడా ఆ ఛైర్‌లో కూర్చొని సందేశం రిలీజ్ చేయలేదు. దీన్ని పరిశీలిస్తే తదుపరి దిల్లీ ప్రభుత్వంపై పూర్తి పట్టు తన భార్యకే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఇటీవల దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి సభలోనూ సునీతా కేజ్రీవాల్ చక్కగా ప్రసంగించి భళా అనిపించారు. దిల్లీ సీఎం రేసులో ఆమె ముందంజలో ఉన్నారనేందుకు ఇవన్నీ గ్రీన్ సిగ్నల్స్ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే కేజ్రీవాల్‌కు సపోర్ట్
సునీతా కేజ్రీవాల్ 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి. అరవింద్ కేజ్రీవాల్ 1995 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ శిక్షణా కార్యక్రమంలో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ వెంటనే 1994 నవంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే అరవింద్ కేజ్రీవాల్‌కు సునీత అన్నిరకాల సహాయ సహకారాలను అందించారు. అన్నా హజారేతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ సునీత పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆ సమయంలో తన ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రచారానికి సునీత సహాయం చేశారు. 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఈ పరిణామం జరిగిన ఏడాది తర్వాత 2016లో సునీత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్‌కు ముందు ఆమె చివరి పోస్టింగ్ దిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అడిషనల్ కమిషనర్‌. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గురించి అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఈ విజయం వెనుక తన భార్య సహకారం కూడా ఉందని వెల్లడించారు.

బైపోల్‌ బరిలో కల్పనా సోరెన్- గెలిస్తే సీఎం?
కల్పనా సోరెన్ ఈమె ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా కొన్ని నెలల క్రితమే ఈడీ అరెస్టు చేసింది. అయితే అరెస్టయిన వెంటనే సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేశారు. దీంతో వెంటనే కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా హేమంత్ సోరెన్‌కు విశ్వాసపాత్రుడిగా పేరొందిన చంపయీ సోరెన్‌కు సీఎం సీటును కట్టబెట్టారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ అరెస్టులకు నిరసనగా ఇటీవల దిల్లీలో విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన సభలో కల్పనా సోరెన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి సునీత కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు కల్పన. ఈ ఎన్నికల్లో కల్పన, సునీత పరస్పరం పార్టీల అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.

భర్త హేమంత్ సోరెన్ అరెస్టయ్యాక
కల్పనా సోరెన్ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ వాస్తవ్యులు. ఆమె ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏలో డిగ్రీని పూర్తి చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు. హేమంత్ సోరెన్‌తో కల్పన పెళ్లి 2006 సంవత్సరంలో జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఝార్ఖండ్ పాలిటిక్స్‌లో కల్పనా సోరెన్ యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేశాక, మార్చి 4న ఝార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఝార్ఖండ్‌లోని గాండే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు కల్పన రెడీ అవుతున్నారు. ఒకవేళ గాండే అసెంబ్లీ ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ గెలిస్తే, చంపయూ సోరెన్ స్థానంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సునేత్రా పవార్ వర్సెస్ సుప్రియా సూలే
పవార్ ఫ్యామిలీ మహారాష్ట్రలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబం. గతేడాది చివర్లో ఈ ఫ్యామిలీ రాజకీయంగా చీలిపోయింది. శరద్ పవార్ పెట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ) రెండు ముక్కలైంది. అజిత్ పవార్ వర్గం ఒక పార్టీగా, శరద్ పవార్ వర్గం మరో పార్టీగా ఏర్పడ్డాయి. బీజేపీతో చెయ్యి కలిపిన అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు చర్చంతా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ గురించే జరుగుతోంది. ఎన్​సీపీని చీల్చడం ద్వారా శరద్ పవార్‌ను దెబ్బతీసిన అజిత్ పవార్, ఇప్పుడు ఆయన్ను సొంత నియోజకవర్గం బారామతిలోనూ దెబ్బతీసేందుకు ప్లాన్ చేశారు.

వదినతో పోటీ పడుతున్న మరదలు
ప్రతిసారీ పుణె జిల్లాలోని బారామతి లోక్‌సభ స్థానాన్ని ఎన్​సీపీ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఇక్కడి నుంచి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పరస్పరం తలపడబోతున్నారు. సుప్రియాకు సునేత్ర వదిన అవుతారు. అంటే ఇది వదినా మరదళ్ల కాంపిటీషన్. ఎన్​సీపీ గుర్తు, పేరు తమకే ఉన్నందున సునేత్ర గెలిచి తీరుతారనే ధీమాలో అజిత్ పవార్ ఉన్నారు. దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం ఎవరి గాలి వీచదని సుప్రియా సూలే అంటున్నారు. ఇది రాజకీయ యుద్ధమే తప్ప, కుటుంబ వైరం కాదని ఆమె చెబుతున్నారు. సునేత్రా పవార్ చాలా ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా బారామతిలోని జనంతో మమేకమవుతున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె నడుపుతున్నారు. స్థానికంగా విద్యా ప్రతిష్ఠాన్‌ అనే పేరు కలిగిన విద్యా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. సునేత్ర, అజిత్‌కు ఇద్దరు కొడుకులు. సునేత్రకు ఈసారి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన మద్దతు లభించనుంది. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన మద్దతుతో సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు.

LDF x UDF x NDA- జాతీయ సమస్యలే ప్రధాన ఎజెండా- కేరళలో హోరాహోరీ పోరు తప్పదు! - Lok Sabha Election 2024 Kerala

బీజేపీ 'మిషన్ సౌత్​'- 83 సీట్లపై గురి- దక్షిణాదిలో మోదీ వ్యూహమిదే! - bjp mission south

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.