ETV Bharat / bharat

'ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు అందాయ్- అప్పుడే అన్నీ బయటపెడతాం!'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 7:41 PM IST

Updated : Mar 13, 2024, 7:54 PM IST

Electoral Bonds Disclosure CEC
Electoral Bonds Disclosure CEC

CEC On Electoral Bonds : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను గడువులోగా ప్రజలకు వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. బాండ్లకు సంబంధించిన సమాచారం ఎస్‌బీఐ నుంచి ఈసీకి అందిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.

CEC On Electoral Bonds : రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఎస్​బీఐ నుంచి అందాయని, వాటిని గడువులోగా బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం సాయంత్రంలోగా ఎలక్టోరల్​ బాండ్ల వివరాలను ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈసీకి సదరు డేటాను అందించింది.

'శుక్రవారం అన్నీ వివరాలు ప్రజల్లోకి'
'ఎస్‌బీఐ ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలకు సంబంధించి మార్చి 12వ తేదీ నాటికి మాకు డేటా అందాల్సి ఉంది. అది మా వద్దకు ఇప్పటికే చేరింది. ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం. పారదర్శకత విషయంలో కమిషన్‌ అనేది ఎప్పుడూ ముందుంటుంది. గడువులోగా ఆ వివరాలన్నింటినీ బహిర్గతం చేస్తాం' అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

'లోక్‌సభ ఎన్నికలకు మేం సిద్ధం'
మరోవైపు లోక్​సభ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు రాజీవ్ కుమార్. మరికొద్ది వారాల్లో జరగనున్న ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌తో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పలు పార్టీలు నివేదించినట్లు తెలిపారు. నాయకులందరికీ సమానమైన భద్రతను కల్పించాలని పలు పార్టీల నాయకులు తమను కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

'2024 లోక్‌సభ ఎన్నికలకు మేం సిద్ధం. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఈ ప్రజాస్వామ్య పండగలో ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా పాల్గొనాలని జమ్ముకశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు గాను ప్రతీ జిల్లాలో ఒక సోషల్‌ మీడియా సెల్‌ను ఏర్పాటుచేస్తున్నాం. అభ్యర్థులందరికీ సరైన భద్రత సమకూర్చి కేంద్ర బలగాలను దించుతాం. జమ్ముకశ్మీర్‌లో ఆన్‌లైన్‌ నగదు బదిలీపైన కూడా పర్యవేక్షణ ఉంటుంది' అని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

బీజేపీ 'టార్గెట్ 370'- నలుగురు కేంద్రమంత్రులకు సీట్లు- ఎంపీగా ఖట్టర్ పోటీ

నిన్న సీఎంగా, నేడు ఎమ్మెల్యేగా ఖట్టర్‌ రాజీనామా- ఇక బాధ్యతంతా నాయబ్​దే!

Last Updated :Mar 13, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.