తెలంగాణ

telangana

T20 world cup 2021: భారత జట్టులో కోహ్లీ, రోహిత్.. మరి పాక్​లో!

By

Published : Oct 23, 2021, 2:54 PM IST

చిరకాల ప్రత్యర్థుల మధ్య రసవత్తర (T20 world cup 2021) సమరానికి రంగం సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్​లో ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో భారత్‌-పాకిస్థాన్ తలపడనున్నాయి. అనిశ్చితికి మారుపేరైన పాక్‌ను అన్ని రంగాల్లో దుర్బేధ్యంగా ఉన్న టీమ్ఇండియా ఢీ కొట్టనుంది. ప్రపంచకప్‌ సమరాల్లో ఇంతవరకూ తిరుగులేని భారత్‌ జట్టు మరోసారి దాయాదికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత జట్టంతా (india vs pak match) మ్యాచ్‌ విన్నర్లే కనిపిస్తుండగా పాక్‌లో మాత్రం భారమంతా ఇద్దరు ముగ్గరు ఆటగాళ్లపైనే ఉంది.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్ 2021

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఆదివారం (T20 world cup 2021) హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలుస్తుందో అని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ఇండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్‌ జట్టును తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్‌లో భారత్ ప్రపంచంలోని అన్ని జట్లకన్నా అత్యుత్తమంగా కనిపిస్తోంది. భారత్‌లో రోహిత్‌శర్మ ఉంటే పాక్‌లో (india vs pak match) బాబర్‌ అజామ్‌ ఉన్నాడు. ఇటు.. కోహ్లీ, రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యాలతో టీమ్ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ దృఢంగా కనిపిస్తుంటే దాయాది జట్టులో మహ్మద్‌ రిజ్వాన్‌, ఫకర్‌ జమాన్‌, సీనియర్ షోయబ్‌ మాలిక్‌ ఉన్నారు. భారత్‌లో చివరి వికెట్‌ వరకూ పరుగులు రాబట్టగల ఆటగాళ్లు ఉండగా.. పాక్‌లో పరిస్థితి అలా లేదు. బాబర్‌ అజామ్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్న పాక్‌.. ఇటీవల అతడు విఫలమైతే పేకమేడలా కుప్పకూలుతోంది.

భారత్-పాక్ మధ్య మ్యాచ్​

దశాబ్దాలుగా పాకిస్థాన్ జట్టు ప్రధాన బలం బౌలింగ్‌. కానీ గతమెంతో ఘనకీర్తి కలిగిన పాక్‌ బౌలింగ్‌ ఇప్పుడు భారత్‌ అంత దృఢంగా లేదు. భారత్‌లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌ పేస్ దళాన్ని మోస్తున్నారు. శార్దూల్‌, జడేజా, అశ్విన్‌ అల్‌రౌండర్లుగా సత్తా చాటుతున్నారు. కానీ పాక్‌లో షాహీన్‌ అఫ్రిది ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తుండగా.. హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ ఎప్పుడెలా బంతులేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో అద్భుత స్పిన్నర్లు ఉండే పాక్‌లో ప్రస్తుత జట్టులో చెప్పుకోదగ్గ స్పిన్నరే లేడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ పాక్‌ బౌలింగ్‌ బలహీనతను బయటపెట్టింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసినా పాక్‌కు ఓటమి తప్పలేదు. పాక్‌ బౌలర్లను సఫారీలు దంచికొట్టారు. భారత్‌ పేస్‌, స్పిన్‌ దళాలు బలంగా కనిపిస్తుండగా పాక్‌లో మాత్రం పేస్‌ బౌలింగ్‌ పర్వాలేదనిపించినా స్పిన్‌ దళం మాత్రం బలంగా లేదు.

తక్కువ అంచనా వేయలేం..

పాక్ జట్టు​

సరిగ్గా టీ20 ప్రపంచకప్‌నకు ముందే పాక్‌ ప్రధాన కోచ్‌ మిస్బావుల్‌ హక్, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ రాజీనామా చేశారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్‌ రజా బాధ్యతల స్వీకరణ, పొట్టి కప్పు కోసం మొదట ప్రకటించిన జట్టుపై విమర్శలు, తిరిగి ఆటగాళ్ల జాబితాలో మార్పులు, కొత్త కోచ్‌ల నియామకం వంటి పరిస్థితుల మధ్య పాక్‌ టీ20 ప్రపంచకప్‌నకు వచ్చింది. కొత్త కోచ్‌లు హేడెన్‌, ఫిలాండర్‌లు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోతేనే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో గెలవడం.. కచ్చితంగా విజయం సాధిస్తుందనకున్న మ్యాచ్‌లో చేజేతులా పరాజయం పాలవడం పాక్‌కు అలవాటుగా మారింది. అలా అనీ పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. తమదైన రోజున బాబర్‌ సేన ఏ జట్టునైనా ఓడించగలదు. భారత్‌- పాకిస్థాన్​ల మధ్య ఇప్పటివరకూ మొత్తం 199 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగే 200వ చారిత్రక మ్యాచ్‌లో గెలిచి రికార్డు సృష్టించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

ఇదీ చదవండి:'టీమ్​ఇండియా వద్ద ప్లాన్‌-బి లేదు.. నాకౌట్‌లో చిత్తవ్వొచ్చు'

T20 world cup 2021: కోహ్లీసేన బలాలు, బలహీనతలు

ABOUT THE AUTHOR

...view details