లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి రాక..
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో పరువు హత్య వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 22ఏళ్ల ధనశేఖర్ (Dhanasekar) అనే యువకుడు బెంగుళూరులో డ్రైవర్గా పనిచేస్తుండగా.. లాక్డౌన్ కారణంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ధనశేఖర్ నివాసానికి తిరిగి రాకపోవటంతో.. సోమవారం పలమనేరు ఠాణాలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమ(love)లో ఉన్నాడని, ఈ మేరకు యువతి తండ్రిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు.
విచారణలో దారుణ విషయాలు..
ఈ నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు (Missing Case) కింద దర్యాప్తు ప్రారంభించగా.. విచారణలో దారుణ విషయాలు వెలుగు చూశాయి. యువతి తండ్రి బాబు కాల్ డేటా, ధనశేఖర్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. శనివారం రాత్రి యువతి తండ్రి నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అత్యంత పాశవికంగా కత్తితో నరికేశానని(Brutal murder) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
విచక్షణ కోల్పోయి..
శనివారం రాత్రి యువతి తన తండ్రి ఫోన్ నుంచి ధనశేఖర్కి ఫోన్ చేయగా.. ఇద్దరు యువతి ఇంట్లోనే కలుసుకున్నారు. బాబు అనుమానంతో అర్థరాత్రి కుమార్తె గది సమీపంలోకి వెళ్లగా ఇద్దరూ సన్నిహితంగా ఉండటంతో యువతి తండ్రి విచక్షణ కోల్పోయాడు. కత్తితో యువకుడిపై తీవ్రంగా దాడి చేస్తూ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన యువతి తండ్రి.. అనంతరం హత్య చేసి బావిలో పడేశాడు.