తెలంగాణ

telangana

Ganesh immersion: గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

By

Published : Sep 18, 2021, 12:30 PM IST

Updated : Sep 19, 2021, 2:45 AM IST

గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గణేశ్​ నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరంలో పెద్దఎత్తున కొనసాగనున్న నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికెడ్లు ఏర్పాటు చేశారు.

తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న వినాయకుడు.. గంగమ్మ తల్లి ఒడిలోకి చేరుకోనున్నారు. రాష్ట్ర రాజధానిలో జరగనున్న నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం కోసం ఎన్టీఆర్‌ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌ వైపు 7, ట్యాంక్‌బండ్‌ మీద 12, చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలో 3, కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో 3, మొత్తంగా 55 క్రేన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. విమానాశ్రయానికి వెళ్లే వారు బాహ్యవలయ రహదారి మీదుగా వెళ్లాలని, రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీస్​ అధికారులు సూచించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సోమవారం ఉదయం 8 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి.

విగ్రహాలను నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చే వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ముందుకు సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతర్రాష్ట్ర జిల్లాల నుంచి లారీలు, భారీ వాహనాల ప్రవేశాలను పూర్తిగా నిషేధించారు. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఆంక్షలపై సందేహాలు ఉంటే ప్రజలు పోలీస్​ హెల్ప్‌లైన్లు 040 27852482, 9490598985, 9010203626 నెంబర్లను సంప్రదించవచ్చని ట్రాఫిక్‌ అదనపు పోలీస్​ కమిషనర్‌ చౌహాన్‌ తెలిపారు.

ప్రధాన శోభాయాత్ర కేశవగిరి నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, కందికల్‌గేట్‌, ఛత్రినాక, లాల్‌దర్వాజ, నాగులచింత, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, సిద్దియంబర్‌ బజార్‌, మోజంజాహిమార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, తదితర ప్రాంతాల మీదగా ఊరేగింపు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.

గణేశ్ నిమజ్జన(Ganesh immersion)గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు

  • బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర, ఫలన్​నుమా నుంచి వచ్చే శోభాయాత్రను.. చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్​టీఆర్​ మార్గ్​కు తరలింపు.
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్​టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.
  • ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర.. రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.
  • దిల్​సుఖ్​నగర్, ఐఎస్​ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా తరలింపు.
  • టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర.. మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​ వైపు మళ్లింపు.

ట్రాఫిక్ ఆంక్షలు

  • మెహిదీపట్నం, తప్పాచబుత్రా, అసిఫ్​నగర్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సీతారాంబాగ్, బోయగూడ కమాన్, గోషామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.
  • ఈ రూట్ మ్యాప్​లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లానని పోలీసుల సూచన.
  • ఎర్రగడ్డ, ఎస్సార్​నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర.. అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్​టీఆర్​ మార్గ్​కు చేరుకోనుంది.

ప్రతి శోభాయాత్ర(Ganesh immersion)మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఏర్పాటు చేయనున్నారు. నీలి, ఆరెంజ్, ఎరుపు, ఆకుపచ్చ రంగులు.. వాటికి కేటాయించిన రంగు ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఇదీ చదవండి :covid third wave india: మూడో దశ వ్యాప్తికి అదే కీలకం!

Last Updated :Sep 19, 2021, 2:45 AM IST

ABOUT THE AUTHOR

...view details