తెలంగాణ

telangana

రూ.10 ఇవ్వలేదని దారుణం.. స్నేహితుడిని రాయితో కొట్టి చంపి..

By

Published : Dec 15, 2022, 3:44 PM IST

డబ్బులు ఇవ్వలేదని ఓ స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ యువకుడు. మరోవైపు డబ్బుల కోసమే తన ఫ్రెండ్​ను కిడ్నాప్​ చేశాడు ఓ వ్యక్తి.

murder
murder

పది రూపాయలు ఇవ్వనందుకు ఓ స్నేహితుడిని రాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు. తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగాల్​లోని సిలిగుడిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. సిలిగుడికి చెందిన రాంప్రసాద్​ సాహా, సుబత్రా దాస్​ స్నేహితులు. మత్తుపదార్థాలకు బానిసైన ఆ ఇద్దరు ​ తరచూ అడవులకు వెళ్లేవారు. ఈ క్రమంలో సోమవారం రామ్​ప్రసాద్​, సుబత్రా అజయ్ అనే మిత్రుడి​తో కలిసి​ అడవులకు వెళ్లారు.

తీరా అక్కడికి వెళ్లాక పది రూపాయలు తగ్గడంతో ఆ డబ్బులను ఇవ్వమని​ సుబత్రను రాంప్రసాద్ అడిగాడు. డబ్బులు ఇవ్వనని సుబత్రా తెలపడం వల్ల ఆగ్రహించిన రాంప్రసాద్​ పక్కనే ఉన్న ఓ బండరాయితో సుబత్రను హతమార్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి బుధవారం నిందితులను పట్టుకున్నారు.

అప్పు తీర్చేందుకు స్నేహితుడి కిడ్నాప్​..
అప్పులు తీర్చేందుకు డబ్బులు కావాలని ఓ యువకుడిని కిడ్నాప్​ చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరిగింది. ఓ మహిళ ఫోన్​ కాల్​తో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా విచారణలో షాకింగ్​ నిజాలు బయటపడ్డాయి.

అసలు ఏం జరిగిందంటే
ధుమన్‌గంజ్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్ ఆపరేటర్ భీమ్ సింగ్ కుమారుడు వాసు మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో పొరిగింట్లో నివసిస్తున్న రిటైర్డ్ సైనికుడి కుమారుడు సర్వేశ్​ సింగ్ పిలిచాడు. తెలిసిన వ్యక్తి పిలిచాడని ఆ యువకుడు సైతం అతని కారు ఎక్కాడు. అదే కారులో వెనుక కూర్చున్న సర్వేశ్​ స్నేహితులతో మద్యం సేవించిన వాసు.. కాసేపటికే స్పృహ కోల్పోయాడు.

ఇదే సరైన సమయం అని భావించిన సర్వేశ్​ ప్లాన్​లో భాగంగా అతన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసుల తనిఖీలకు భయపడి అతన్ని అదే ప్రాంతంలోని ఓ ఫ్లాట్​లో దాచి ఉంచారు. ఆ తర్వాత వాసు ఫోన్​ నుంచి భీమ్​ సింగ్​కు కాల్​ చేసి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇవ్వకపోతే వాసును చంపేస్తామని బెదిరించారు. అప్పటికే వాసు ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దీంతో వాసు నెంబర్​ను పోలీసులు ట్రాక్​ చేశారు. దాని ఆధారంగా నిందితులను వెతికే ప్రయత్నాలను ప్రారంభించారు. అలా గాలిస్తున్న పోలీసులకు ఓ మహిళ కాల్​ చేసి యువకుడి ఆచూకీ తెలిపింది. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జూదానికి అలవాటు పడి వ్యాపారం ప్రారంభించక ముందే మూతపడటంతో రూ.లక్షల్లో అప్పులు చేశానని పోలీసులకు నిందితుడు సర్వేశ్​ తెలిపాడు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గెస్ట్ హౌస్ నిర్వాహకుడి కుమారుడిని కిడ్నాప్ చేసి నగదు వసూలు చేసేందుకు కుట్ర పన్నానని విచారణలో ఒప్పుకున్నాడు. కేసు విజయవంతంగా చేధించినందుకు పోలీసు బృందానికి కమిషనర్ రమిత్ శర్మ రూ.25,000 రివార్డును అందించారు.

ABOUT THE AUTHOR

...view details