Si, Constable Candidates Protest in AP :గతేడాది నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రభుత్వం చేసిన తప్పుకు వేలాదిమంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర మండిపడ్డారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులను కలిపి అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడలో ఆందోళన చేశారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తక్షణమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పోలీస్ నియామకాలలో ఒక్క పోలీస్ ఉద్యోగాన్ని కల్పించలేదన్నారు. ఒకటి, రెండు మార్కుల వ్యత్యాసంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేల మంది పోలీసు ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తక్షణమే దేహదారుడ్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే పోలీసు ఉద్యోగాల అభ్యర్థులతో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెనుకాడమని హెచ్చరించారు.