Perni Nani Complaint to CMO on Eluru Collector : ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవహరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ గైర్హాజరు కాగా... దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని సహా ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టర్ వ్యవహారంపై జడ్పీటీసీ సభ్యులతో కలసి సీఎం కార్యాలయం వద్ద నిరసనకు తీర్మానం చేయాలని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పరిధిలో నిర్వహించే సమావేశాలకు రాకుండా కలెక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలు, అందుకు సంబంధించిన వేదికలను గౌవరించని ఏ స్ధాయి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ వ్యవహారంపై బుధవారం సీఎంవో సహా సీఎస్ జవహర్ రెడ్డికీ మాజీ మంత్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన సీఎంవో.. కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. జడ్పీ సమావేశాలకు గైర్హాజరు అయ్యేందుకు కారణాలపై సీఎంవో అధికారులకు కలెక్టర్ వివరణ ఇచ్చారు. కలెక్టర్ తీరుపై సీఎంవో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నిరసనకు దిగుతాం : తరువాత సమావేశానికి కలెక్టర్ హాజరు కాకపోతే సీఎం జగన్ నివాసం వద్ద నిరసనకు దిగుతామని, చెప్పిన మాట నుంచి వెనక్కి వెళ్లేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
TAGGED:
పేర్ని వర్సెస్ కలెక్టర్