Illegal diesel danda in YSR district: వైఎస్సార్ జిల్లా అంటే బంగారం, వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతంలో గతకొన్ని నెలలుగా అక్రమ వ్యాపారాలు విపరీతంగా విస్తరిస్తున్నాయి. సులువుగా డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో అనేక మంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎంచుకున్న దందాను యథేచ్ఛగా సాగిస్తూ.. లక్షల రూపాయలను అర్జిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్, మాట్కా, జూదం, అక్రమ చౌక బియ్యం, అక్రమ బంగారం, పొరుగు రాష్ట్రాల మద్యం దిగుమతి వంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా అక్రమ డీజల్ దందాకు తెరలేపడం సంచలనంగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా డీజల్ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయం అధికారులు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా కర్ణాటక డీజిల్ దిగుమతి: పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన పట్టణం కావడంతో అక్రమ దందాలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు తమ వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పరిస్థితికి అనుగుణంగా అక్రమ వ్యాపారాలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున డీజల్ను దిగుమతి చేస్తున్నారు. ఏపీతో పోలిస్తే.. కర్ణాటకలో లీటరుపై సుమారు రూ. 10 వరకూ తక్కువ ఉండటంతో అక్కడి నుంచి డీజల్ తెప్పిస్తున్నారు. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ప్రతి నెలా లక్షల లీటర్ల ఇంధనం అక్రమ పద్దతిలో దిగుమతి అవుతోంది.
ఒక్కో ట్యాంకర్ డీజల్పై రూ.2 నుంచి 3 లక్షల ఆదాయం:ఈ క్రమంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాదుకు, బెంగుళురుకు, చెన్నైకి, విజయవాడ వంటి ప్రధాన నగరాలకు బస్సులు వెళ్తుంటాయి. దీంతో పాటు జిల్లాలో ఉన్న సిమెంటు, తదితర చిన్న పరిశ్రమలకు సంబంధించిన లారీలు కూడా అధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఆ వాహనాలకు డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుండడంతో..కర్ణాటక డీజల్ను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ డీజల్పై రూ.2 నుంచి 3 లక్షల వరకూ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ ఒక ట్యాంకర్ చొప్పున నెలకు పదుల సంఖ్యలో ట్యాకర్ల ద్వారా కర్ణాటక డీజల్ దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.