ఆంధ్రప్రదేశ్

andhra pradesh

No Water: సమృద్ధిగా నీరు.. అయినా ఎండిపోతున్న వరి పొలాలు.!

By

Published : Mar 20, 2022, 10:49 AM IST

Water problem for agriculture: సమృద్ధిగా సాగునీరు ఉండే పశ్చిమగోదావరి డెల్టాలో... ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సాగునీటి కొరతతో వరి పొలాలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీరు లేక చేలు దెబ్బతిన్నాయి. వంతులవారీగా నీటిని మళ్లిస్తున్నా, పొలాలు తడవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Water problem for agriculture in west godavari
పశ్చిమగోదావరి డెల్టాలో నీటి ఎద్దడి

పశ్చిమగోదావరి డెల్టాలో నీటి ఎద్దడి

Water problem for agriculture: వేసవి ఆరంభంలోనే పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో సాగునీటి ఎద్దడి ఏర్పడింది. ప్రధాన కాలువల్లో నీటిప్రవాహాలు తగ్గడం వల్ల... పిల్లకాలువలకు నీరందడం లేదు. దీనివల్ల కాలువల శివారున వేల ఎకరాల వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా నెలకు పైగా సాగునీటి సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పుడే ఎద్దడి ఏర్పడటం రైతులను భయపెడుతోంది. ఎండలు ముదిరేకొద్దీ పరిస్థితి ఏంటని.. ఉండి మండలం చెరుకువాడకు చెందిన కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు లేక కౌలు రైతులు సాగు చేస్తున్న పొలాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు సొంతంగా డబ్బులు ఖర్చుచేసి.. కాలువలో పూడిక తీశారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

గోదావరిలో నీరున్నా కాలువలు పూడిపోయి..

సాగునీటి కాలువల శివారు ప్రాంతాల్లో నానాటికీ జలమట్టం పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గోదావరిలో నీరున్నా కాలువలు పూడిపోయి.. వరి సాగు దినదినగండంగా మారుతోంది. వంతులవారీగా నీరు విడుదల చేస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. ఒక్కో కాలువకు వారంలో 3రోజులుగా వంతులు ఇవ్వాల్సి ఉండగా.. రెండు రోజులతో సరిపెడుతున్నారు. దీనివల్ల నీరు చేరక చివరి పొలాలు ఎండిపోయాయి. 15 రోజులుగా నీళ్లు లేక.. 30వేల ఎకరాలకు పైగా వరి పొలాల్లో బీటలు వచ్చాయి.

ముందుకు కదలని నీరు..

సాగునీటి కాలువల్లో పూడిక, తూడు, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి నీరు ముందుకు కదలడం లేదు. రెండేళ్లకోసారి కాలువల్లో పూడిక తీయాల్సి ఉండగా.. ఐదేళ్లయినా పట్టించుకున్నవారే లేరు. కొన్నిచోట్ల డీజిల్ ఇంజిన్ల సాయంతో రైతులు నీటిని తోడుకుంటున్నారు. ఇందుకోసం ఎకరాకు 3 వేల నుంచి 5వేల రూపాయల అదనపు భారం పడుతోంది.

పూడిక తీయించాలని కోరుతున్న రైతులు..

శివారు పొలాలకు నీరందించాల్సిన బాధ్యతను గుర్తించి.. కాలుల్లో వెంటనే పూడిక తీయించాలని రైతులు కోరుతున్నారు. సాగనీరు సక్రమంగా అందితే.. కొంతైనా పంటను కాపాడుకుంటామని రైతులు అంటున్నారు.

ఇదీ చదవండి:

Exports Increased: కొవిడ్ సమయంలో రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు.. అంచనా విలువ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details