ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పింఛన్​ లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనుకోవడం సరికాదు: పవన్​

By

Published : Dec 28, 2022, 6:18 PM IST

Jana Sena Pawan Kalyan is letter to CM Jagan: రాష్ట్రంలో సామాజిక పింఛన్లు తొలిగించేందుకు.. వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు సమంజసంగా లేవని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆరోపించారు. ​పింఛన్లు తొలిగింపుపై పునరాలోచించాలని పవన్​ సీఎం జగన్​కు లేఖ రాశారు.

Etv Bharat
Etv Bharat

Pawan Kalyan letter to CM Jagan: రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్​కు జనసేన అధినేత పవన్​కల్యాణ్​ రాసిన లేఖలో పేర్కొన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారన్నారు. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటివరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. మచ్చుకు కొన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.

  • శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి.. ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని కారణం చూపారు. అదే నిజమైతే ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
  • పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారు. నిజంగా అన్ని ఇళ్ళు రామక్కకు ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి.. ఆ ఇళ్ల తాళాలు ఇవ్వండి.
  • మెళియాపుట్టి ప్రాంత వృద్ధులైనా, రజక వృత్తి చేసుకొనే రామక్క పేదలే. వారికి తండ్రి నుంచో, తాతల నుంచో వారసత్వంగా వచ్చిన ఎస్టేట్లు, ఇళ్ళు లేవని గ్రహించగలరు. మీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంతటి ఆస్తిపరులే అయితే పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ, మీ వాలంటీర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు?
  • విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉంది. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయి. అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయి. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను, వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
  • ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారు అని నోటీసుల్లో చూపించి వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ తరహా నోటీసులు సమర్థనీయమేనా? ఈ తరహా నోటీసులు దివ్యాంగులకు సైతం వేదన కలిగిస్తున్నాయి. పదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడంలో ఉద్దేశం ఏమిటి? వారి వైకల్యం కళ్లెదురుగా కనిపిస్తున్నా లబ్ధికి దూరం చేస్తామనడం భావ్యమేనా?
  • అవ్వా.. తాతా.. అంటూ రూ.3 వేలు పెన్షన్ ఇస్తాను అని మీరు ఇచ్చిన హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలి. అంతేగానీ పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలి అనుకోవడం సరికాదు. మీ పాలనలోని ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏమిటి?

సామాజిక పింఛన్ అందుకొంటున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నానని పవన్​ తెలిపారు. పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని లేఖలో పవన్​ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details