ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ అధికారంలోకి రాగానే మహిళల రక్షణకే తొలి ప్రాధాన్యత: చంద్రబాబు

By

Published : Mar 8, 2023, 8:47 PM IST

Updated : Mar 8, 2023, 10:06 PM IST

chandra babu

'CBN Connect Program with Women' updates: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సాధికరత, విద్య, ప్రభుత్వ పాలసీలు, సంక్షేమం పథకాలతో పాటు మహిళల రక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తామని, చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మద్దతు ఇస్తామని.. నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన 'సీబీఎన్ కనెక్ట్ పోగ్రామ్ విత్ ఉమెన్స్' కార్యక్రమం ద్వారా వర్చ్యువల్ విధానంలో పాల్గొన్న మహిళలతో సుదీర్ఘంగా చర్చించారు.

'CBN Connect Program with Women' updates: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కొరవడిందని, రోజురోజుకు వారిపై హింసలు, దాడులు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా 'సీబీఎన్ కనెక్ట్ పోగ్రామ్ విత్ ఉమెన్స్' కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు వివిధ వర్గాల మహిళలతో, వర్చువల్ విధానంలో పాల్గొన్న మహిళలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

నా తల్లి కష్టాన్ని చూసి దీపం పథకం తెచ్చాము: ఈ సందర్భంగా పలువురు మహిళలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన అనంతరం రాష్ట్రంలోని మహిళల కోసం ఏయే పథకాలు, భద్రత, విద్య, ప్రభుత్వ పాలసీలను ప్రవేశపెట్టనున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''తెలుగుదేశం పార్టీ 1986లోనే మహిళలకు ఆస్తి హక్కును కల్పించింది. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల పదవుల్లో, విద్యలో ఆడపిల్లలకు రిజర్వేషన్‌లను తెచ్చింది టీడీపీనే. ఆనాడు కట్టెల పొయ్యిలపై వంట చేసిన నా తల్లి కష్టాన్ని చూసి తరువాత కాలంలో దీపం పథకం తెచ్చాం. నా జీవితంలో మొదటి గురువు మా అమ్మనే. నాడు తెచ్చిన 33శాతం రిజర్వేషన్ వల్ల.. విద్యలో ఆడ పిల్లలు మంచి అవకాశాలు పొందారు'' అని ఆయన వివరించారు.

అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ పునరుద్దరిస్తాం:వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైద్యం పూర్తిగా పడకేసిందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయంలో మహిళల కోసం, పుట్టిన బిడ్డల కోసం తీసుకొచ్చిన పథకాలన్నీంటిని జగన్ సర్కారు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్నింటినీ మళ్లీ పునరుద్దరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, నాణ్యతలేని లిక్కర్ వాడకం పెరగడంతో.. క్రైం విపరీతంగా పెరిగిందని విమర్శించారు.

మహిళల కోసం ఇండస్ట్రియల్ టౌన్ షిప్: మహిళలను ప్రారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ గాజులరామారంలో ఆనాడు ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌ను ప్రవేశపెట్టామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. టీడీపీ హయంలో ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో.. మహిళల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయన్నారు. స్థానిక ఉత్పత్తుల అమ్మకం మొదలు పెట్టిన డ్వాక్రా మహిళలు.. నేడు ప్రపంచ స్థాయికి ఎగుమతులు చేస్తున్నారని తెలిపారు. 1995లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, ఐటి విప్లవం వచ్చాయని.. వీటిని నాడు అందిపుచ్చుకునేలా పాలనలో నిర్ణయాలు చేశామని.. వాటి ఫలితాలు నేడు మనం చూస్తున్నామని చంద్రబాబు అన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే మహిళల రక్షణకే తొలి ప్రాధాన్యత

కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే టీడీపీకే సాధ్యం:టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ అర్హతలు కాకుండా, నిజమైన అర్హతలు చూసి పథకాలను ఇస్తామని.. ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గాలి అంటే అది కేవలం టీడీపీకే సాధ్యమని చంద్రబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నాను.. కుటుంబం సొంతంగా నడవాలి అని నాడు హెరిటేజ్ పెట్టామన్నారు. హెరిటేజ్‌ను తన సతీమణి భువనేశ్వరి బాగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 'నేను మాట్లాడే మహిళా సాధికారత అనేది మా ఇంట్లోనే చేసి చూపించాను' అని ఆయన వెల్లడించారు. భువనేశ్వరి వల్లనే తాను రాజకీయాల్లో నిరంతరం పని చేయగలుగుతున్నానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అందరి భవిష్యత్ బాగుండాలి అంటే మళ్లీ తెలుగుదేశం రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో మహిళలు ఆలోచించి తెలుగు దేశం పార్టీకి అండగా నిలవాలి ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సాధికరత, విద్య, ప్రభుత్వ పాలసీలు, సంక్షేమం పథకాలతో పాటు మహిళల రక్షణకే తొలి ప్రాధాన్యత ఇస్తామని, చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మద్దతు ఇస్తామని.. నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 8, 2023, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details