ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అయోమయంలో వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ నిర్ణయాలతో భక్తుల అవస్థలు

By

Published : Dec 31, 2022, 9:31 AM IST

TTD DECISION OVER VAIKUNTA EKADASI : తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి తితిదే అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముందస్తు ప్రకటనలు లేకుండా శని, ఆదివారాల్లో సమయనిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేతతో పాటు.. గత రెండు రోజులుగా ఆఫ్​లైన్లో టోకెన్ల జారీ తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టీటీడీ తీసుకొన్న నిర్ణయాలు భక్తులను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి.

TTD DECISION OVER VAIKUNTA EKADASI
TTD DECISION OVER VAIKUNTA EKADASI

DEVOTEES CONFUSED WITH TTD DECISIONS : వైకుంఠ ఏకాదశి పర్వదినం మొదలు.. పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తి.తి.దే చేస్తున్న ప్రకటనలకు, అధికారుల నిర్ణయాలకు పొంతన లేకుండా పోతోంది. నూతన సంవత్సరం, ఏకాదశి పర్వదినాల పేరుతో శని, ఆదివారాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశారు.

ఎస్​ఎస్​ఎడీ టోకెన్లు ఉన్నవారితో పాటు లేనివారిని దర్శనానికి అనుమతించేవారు. శని, ఆదివారాల్లో రోజుకు 25 వేల చొప్పున తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేసే టోకెన్లను ముందస్తు ప్రకటన లేకుండా నిలిపివేశారు. టోకెన్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తార లేదా.. అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా భక్తుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

తిరుపతిలోని మూడు కేంద్రాల్లో గత కొంత కాలంగా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తూ వచ్చారు. శని, ఆది వారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేసేవారు. ఏడాది చివరి రోజు శనివారం నాడు రాగా, జనవరి ఒకటవ తేదీ ఆదివారం, సోమవారం వైకుంఠ ఏకాదశి రావడంతో..శని, ఆదివారాల్లో సర్వదర్శనం చేసుకునే భక్తులకు టోకెన్ల జారీ నిలిపివేశారు.

సాధారణంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పుడు 3 రోజులపాటు ప్రత్యేక దినాలు ఉండటంతో మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. శనివారం వచ్చే భక్తులకు ఆదివారం ఉదయం వరకు దర్శనం కల్పించే అవకాశం ఉన్నా, ఆదివారం వచ్చే భక్తులకు ఎప్పటిలోగా దర్శనం పూర్తి చేస్తారనే విషయమై తి.తి.దే. అధికారులు స్పష్టత ఇవ్వని పరిస్థితి నెలకొంది.

ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటే అదే రోజు రాత్రి వరకు పూర్తి చేయగలరా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దర్శన ఏర్పాట్ల పట్ల తి.తి.దే. తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

టీటీడీ నిర్ణయాలతో భక్తుల అవస్థలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details