శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,868 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 1,248 పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా విద్యశాఖ పనులు మొదలు పెట్టింది. వీటికి రూ. 300 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి.. ఇప్పటివరకు 107 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. నిధుల కొరతతో పాఠశాలల్లోని అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే 8, 9, 10 తరగతి విద్యార్ధులకు పాఠశాలలు తెరవడం వల్ల.. ఉపాధ్యాయులతో పాటు విద్యార్ధులు నానాపాట్లు పడుతున్నారు.
పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానోపాధ్యాయులే దగ్గరుండి చేయించారు. సామగ్రి కూడా కొనుగోలు చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు రాగానే చెల్లింపులు చేస్తారనే ఉద్దేశంతో.. తెలిసిన దుకాణాల నుంచి సామగ్రిని తీసుకొచ్చి పనులు చేయిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి నగదు చెల్లించలేక.. నిర్మాణ కార్మికులకు రోజు వారీ వేతనాలు ఇవ్వలేక అప్పుల్లో కూరుకుపోయారు. దుకాణ యజమానులు సొమ్ము చెల్లించాలని అడుగుతుండగా.. ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. పనులు చేయలేమని కార్మికులు చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో.. చేసేది లేక ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు.