ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రైవేటు బస్సులో భారీ చోరీ, రూ.25 లక్షలు అపహరణ

By

Published : Aug 25, 2022, 10:28 PM IST

Updated : Aug 26, 2022, 11:50 AM IST

ప్రైవేటు బస్సులో భారీ చోరీ

Theft in Bus చిలకలూరిపేట మార్టూరు మధ్య ఓ ప్రైవేటు బస్సులో రూ.25 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. ప్రయాణికుడు టిఫిన్ కోసం మార్టూరు వద్ద బస్సులోంచి కిందకు దిగగా దుండగులు చోరీకి పాల్పడ్డారు.

Rs.25 Lakhs theft in Bus: చిలకలూరిపేట మండలం బొప్పూడి- తాతపూడి మధ్య జాతీయ రహదారి పక్కన ఓ దాబా హోటల్‌ వద్ద ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్‌ నుంచి రూ.25 లక్షల గురువారం రాత్రి చోరీ అయ్యాయి. బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం వింజనంపాడుకు చెందిన పుసులూరు ఆంజనేయులు గురువారం రాత్రి ఆటోలో చిలకలూరిపేట పట్టణంలో ఎన్నార్టీ సెంటర్‌లోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ వద్దకు వచ్చాడు. ఆయన చేతిలో బ్యాగ్‌లు ఉన్నాయి. వాటితో బెంగళూరు వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కాడు. బస్సు బొప్పూడి దాటాక దాబా వద్ద భోజనానికి ఆపారు. ఆ సమయంలో బ్యాగులు సీటు వద్ద ఉంచి కిందకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి వచ్చి చూడగా బ్యాగులో ఉన్న రూ.25 లక్షలు మాయమయ్యాయి. ఆంజనేయులు బెంగళూరులో అద్దె వసతి గృహాలు నిర్వహిస్తుంటాడు. కుమారుడు అక్కడే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. కుమారుడు ఒక స్థలం విక్రయించి దానికి సంబంధించిన నగదును వింజనంపాడులో ఉంటున్న తన తండ్రికి గురువారం ఇవ్వమని కొనుగోలుదారులకు చెప్పాడు. వారు ఇచ్చిన రూ.25 లక్షలు కుమారుడికి ఇచ్చేందుకు బెంగుళూరు బయల్దేరిన ఆంజనేయులు బ్యాగులో నుంచి అవి మాయమయ్యాయి. దాబా హోటల్‌ వద్ద అతను కాలకృత్యాలు తీర్చుకునేందుకు కిందకు వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి బ్యాగులోని కవరును తీసుకెళ్లడం చూసినట్లు బస్సులో ఉన్న ప్రయాణికురాలు చెప్పినట్లు సమాచారం. దీంతోపాటు బస్సులో ఉన్న సీసీ కెమెరాకు కూడా గమ్‌ పెట్టినట్లు తెలిసింది. చిలకలూరిపేటలో బయల్దేరిన బస్సును ఒక కారు కూడా అనుసరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి గురువారం రాత్రి 11 గంటల వరకు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు అందితే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

ఇవీ చూడండి

Last Updated :Aug 26, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details