ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల దారిలో జగన్​ ప్రభుత్వం.. తాజాగా పోర్టుల పేరుతో అప్పులు..!

By

Published : Dec 30, 2022, 8:59 AM IST

Updated : Dec 30, 2022, 2:49 PM IST

Andhra Pradesh is Stuck in Debt: రుణాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..పోర్టులను కూడా వదలడం లేదు. ఏపీలో నిర్మించ తలపెట్టిన..భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పేరిట అప్పులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లతో.. అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ రుణాలను సంపద సృష్టికి కాకుండా.. రెవెన్యూ వ్యయానికి మళ్లించే అవకాశం ఉన్నందున.. పనుల పురోగతి చూసే మంజూరు చేయాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

అప్పులు
Debts

Andhra Pradesh is Stuck in Debt: జగన్‌ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది.. మరిన్ని రుణాల కోసం భవిష్యత్తును విస్మరిస్తుండడం..ఆందోళనకరంగా మారింది. తాజాగా ఆర్థిక శాఖ అధికారులు, ఏపీ మ్యారిటైం బోర్డు ప్రతినిధులు.. రుణ సమీకరణకు దిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ- ఆర్​ఈసీ., పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో.. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి 12 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు.. ఆర్​ఈసీ అంగీకరించినట్లు సమాచారం. ఆర్​ఈసీ ఛైర్మన్‌తో అధికారులు చర్చలు జరపగా.. తొలుత 20 శాతం అడ్వాన్సుగా ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది.అంటే దాదాపు 2వేల 400 కోట్లు ఏపీ మ్యారిటైం బోర్డుకు ఆర్​ఈసీ ఇవ్వనుంది.

అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు సేకరించి.., ఆ డబ్బుతో ఆదాయ మార్గాల అన్వేషణను ఎవరూ తప్పుపట్టరు. అయితే ఆస్తులు సృష్టించడం పేరుతో.. తీసుకున్న రుణాన్ని రెవెన్యూ వ్యయానికి మళ్లిస్తే మాత్రం..దాని దుష్ఫలితాలు రాష్ట్రంపై ఏళ్లపాటు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ వ్యయంతో.. ఆస్తులు సృష్టించుకునే అవకాశం లేదు. ఏపీ మ్యారిటైం బోర్డు తీసుకుంటున్న రుణాన్ని.. నిర్దిష్ట ప్రయోజనాలకే వినియోగించేలా రుణదాతలు షరతు విధిస్తే మంచిదని.. నిపుణులు అంటున్నారు.

ఒక ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు.. ఎంత పని జరిగిందో పరిశీలించి.. ఆ మేరకే విడతలవారీగా డబ్బులు విడుదల చేస్తుంది. ఏపీలో..ప్రగతి పనుల పేరుతో ఇస్తున్న రుణాలకూ ఇదే తరహా విధానం అమలుచేయాలని నిపుణులు..అభిప్రాయపడుతున్నారు. రీయింబర్సులాంటి నిబంధనలు పాటిస్తే మేలనే అభిప్రాయం.. వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలవరం పనులకు నిధులను కేంద్రం రీయింబర్సు చేస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులకూ.. ఈ నమూనానే ఉంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ నుంచి బయటపడకపోతే ప్రభుత్వ ఖాతాలు స్తంభింపజేస్తామంటూ.. ఒకే నెలలో రిజర్వు బ్యాంకు రెండుసార్లు హెచ్చరించిన వేళ.. తెచ్చుకుంటున్న రుణాలు ఆస్తుల సృష్టికి ఉపయోగించడం మంచిదనే భావన వ్యక్తమవుతోంది.

అప్పుల దారిలో జగన్​ ప్రభుత్వం.. తాజాగా పోర్టుల పేరుతో అప్పులు..!

రాష్ట్రంలో ప్రగతి కార్యక్రమాలు, నిర్మాణ ప్రాజెక్టులు.. ఎక్కడికక్కడ నిలిచాయి. కొత్తగా రోడ్లూ నిర్మించలేదు. ఉన్న రహదారులు..నరకాన్ని చూపిస్తున్నాయి. ఎన్నికల ముందు పూర్తి చేస్తామన్న సాగునీటి ప్రాజెక్టులకు.. నిధులు వెచ్చిస్తున్నదీ లేదు. అధికార పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సైతం.. ఇలాంటి అంశాలపై తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రుణాల్లో.. కొంత మొత్తం వేరే కార్యక్రమాలకు మళ్లించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రభుత్వం.. తన ఆదాయాన్ని, మద్యం డిపోల ద్వారా వచ్చే రాబడిని ఏపీఎస్​డీసీ కార్పొరేషన్‌కు మళ్లించి.. ఏకంగా 23వేల 500 కోట్ల రుణం తెచ్చింది. బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా.. 8వేల 300 కోట్ల రుణం తీసుకుంది.

ఈ నిధుల వ్యయంపై..శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కేంద్రం గతంలో..రాష్ట్రంలో తాము అమలుచేసే పథకాలకు నిధులు ముందే ఇచ్చేది. తమ నిధులను సంబంధిత పథకాలకు వెచ్చించకపోగా., మళ్లించే పరిస్థితులు కనిపిస్తుండటంతో కేంద్రం తన విధానాన్ని మార్చుకుంది. రాష్ట్రం తన వాటా జమ చేశాకే.. తదుపరి విడత డబ్బులిస్తామని స్పష్టం చేసింది. ఆయా పథకాలకు.., లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నిధులు చేరేలా.. అకౌంటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఒత్తిడి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వేల కోట్లతో పోర్టులు నిర్మిస్తామని తెస్తున్న నిధులు.. అదే ప్రయోజనాలకు వినియోగించుకోకపోతే.. ఆస్తిని సృష్టించకపోగా, రుణ, వడ్డీ భారాలను పెంచుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details