ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాను నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం జగన్​ విఫలం : టీడీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:44 PM IST

TDP Leaders Demand YCP Govt to Pay Compensation: మిగ్‌జాం తుపాను అన్నదాతకు కన్నీటిని మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటి మునిగి పంటలను తెలుగుదేశం నాయకులు పరిశీలించి రైతులను పరామర్శించారు. పంట చేతికందే దశలో నీటిపాలైందని రైతులు నాయకుల వద్ద తమ గోడు వెలిబుచ్చారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టం అంచనా వేయాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

tdp_leaders_demands_compensation_to_farmers
tdp_leaders_demands_compensation_to_farmers

TDP Leaders Demand YCP Govt to Pay Compensation:మిచౌంగ్ తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు( Yanamala Ramakrishnadu on YCP govt) ధ్వజమెత్తారు. తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదలలేదని విమర్శించారు. ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. తుపానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి జగన్ రెడ్డి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. వరి, పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని, తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

'మిగ్​జాం' ప్రభావంతో విజయవాడ విలవిల - రాకపోకలు బంద్, ఆస్తి నష్టం

Kollu Ravindra visit submerged crops:తుపాను ప్రభావిత ప్రాంతాలైన మచిలీపట్నం, క్యాంబెల్ పేట గ్రామాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. కొల్లు రవీంద్ర స్థానికులను పరామర్శించగా వారి సమస్యలను ఏకరవు పెట్టారు. రెండ్రోజులుగా గ్రామంలో కరెంటు, నీరు, తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను కొల్లు రవీంద్ర ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి సహాయం అందిస్తామని తెలిపారన్నారు.

Devineni Uma visit submerged crops:ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మర్సుమల్లిలో దెబ్బతిన్న వరి, మిర్చి, మెుక్కజొన్న పంటపొలాలను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించి రైతులను పరామర్శించారు. చేతికొచ్చిన పంట నష్టపోయి రైతు కష్టంలో ఉన్నాడని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

నష్టపోయిన రైతులకు 48 గంటల్లో తక్షణ సాయం అందించాలి : పురందేశ్వరి

TDP leader Marreddy Srinivasa Reddy on YCP Govt:తుపాను ప్రభావంతో సర్వంకోల్పోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ సహా ఇతర వనరుల దోపిడీకోసం చేస్తున్న ముందస్తు పథకరచనలో సగంకూడా మిగ్ జాం తుపాను బారి నుంచి ప్రజల్ని కాపాడటంలో జగన్ రెడ్డి చేయలేకపోయాడని మండిపడ్డారు. తుపాను రానుందని తెలిసినా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో పంటలు కాపాడటంలో జగన్ రెడ్డి అతని అధికారయంత్రాంగం ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. మిగ్ జాం వల్ల సర్వంకోల్పోయిన ప్రతిరైతు కన్నీళ్లు ముఖ్యమంత్రే తుడవాలన్నారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం తరపున తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'

Former MLA Sriram Tataiah visit submerged crops:ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద పోటెత్తి మండలంలోని వాగులు పొంగటంతో సుమారు పదివేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది. కల్లాలోని ధాన్యం వరద తీవ్రత కొట్టుకుపోయింది. కోతలకు సిద్ధంగా ఉన్న సిద్ధమైన వరి పంట నీట మునిగింది. ఈదురు గాలుల తీవ్రతకు పలుచోట్ల మిర్చి పంట ఒరిగిపోయింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పంట మునిగిన గ్రామాలు ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లో పర్యటించి నష్టం వివరాలను తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details