ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాపే ప్రాణంగా తల్లిదండ్రులు.. సీఎంను కలవనివ్వని పోలీసులు

By

Published : Mar 20, 2023, 10:32 AM IST

Updated : Mar 20, 2023, 11:29 AM IST

cm jagan: మెదడు వాపు వ్యాధికి గురై ప్రాణాపాయ స్ధితిలో ఉన్న పాపని తీసుకుని తల్లిదండ్రులు వైద్య సహాయం కోసం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వద్దకు వచ్చారు. కానీ ఆ పాప తల్లిదండ్రులను సీఎంను కలవకుండా పోలీసులు అడ్డుపడ్డారు. సీఎం కాన్వాయి వెళ్లే మార్గంలో సైతం అనుమతించకపోవడంతో ఆ పాప తల్లిదండ్రులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

child life  providing fund
మెదడు వాపు పాప వార్తలు

మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న భవ్య

Brain swelling disease baby: అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చలాకిగా గంతులువేసిన ఆ పాప ఒక్కసారిగా ఆనారోగ్యం బారిన పడింది. ఆ పాపే ప్రాణంగా జీవిస్తున్న ఆమె తల్లిదండ్రులకు ఒక్కసారిగా గుండెలు ఆగినంత పనైంది. ఆసుపత్రిలో చికిత్స చేయించగా సుమారు 19లక్షల ఖర్చు అయింది. అంతకు మించి డబ్బులు పెట్టే స్తోమత ఆ తల్లిదండ్రుల వద్ద లేదు. తమ పరిస్థితికి చింతించకుండా తమ పాపను ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. అందుకోసం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ వద్దకు వచ్చి పాప చికిత్స కోసం సహాయం చేయాలని వేడుకోవాలనుకున్నారు. దేవుడు వరమిచ్చే వాడో లేదో తెలియదు కానీ, పూజారిలా పోలీసులు ఆ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లారు. సీఎం జగన్​తో తమ సమస్యలు చెప్పుకోనివ్వకుండా అడ్డుపడ్డారు.

జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కోసం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ వస్తున్నారని తెలిసి తమ కూతురు దీనస్థితిని చూపించి వైద్య సాయం అడిగేందుకు వచ్చిన దంపతులపై పోలీసులు కనీసం జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించారు. తిరువూరు సమీపంలోని చీమలపాడు గ్రామానికి చెందిన కళ్యాణి దంపతుల కుమార్తె భవ్య. పది నెలలక్రితం భవ్య మెదడు వాపు వ్యాధి బారిన పడింది. పేదకుటుంబానికి చెందిన వారు ఇప్పటి వరకు అప్పులు చేసి 19 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. అయినా భవ్య ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు.

ప్రాణాపాయంలో ఉన్న తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని సీఎం జగన్ ను కోరేందుకు తిరువూరుకు వచ్చారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చిన్నారిని తీసుకుని బాధితులు సభా స్థలి వద్దకు వచ్చారు. సీఎం జగన్​ను కలిసి తమ దీన స్ధితిని తెలియజేస్తామని పోలీసులను వేడుకున్నారు. అందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను పాప తల్లిదండ్రులు వేడుకున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వీరి పట్ల కనీసం కనికరం చూపలేదు. సీఎం వద్దకు వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కనీసం కాన్వాయ్ వచ్చే మార్గంలోనైనా తమకు అనుమతించాలని, సీఎం చూస్తే తమ దీన స్థితిని చెప్పుకుంటామని భవ్య తల్లిదండ్రులు వేడుకున్నారు. వారిని కాన్వాయ్ మార్గంలో ఉండనివ్వలేదు. తమ కష్టాలు, ఆవేదనను తెలిపి సాయం చేయాలని వేడుకున్నా పోలీసులు కనీసం మానవత్వం చూపలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మెదడు వాపు వ్యాధికి గురై ప్రాణాపాయ స్ధితిలో ఉందని ఇప్పటికైనా సీఎం స్పందించి తన ఇంటి వెలుగును కాపాడాలని వేడుకుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 20, 2023, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details