ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Land Issue: రూ.29 లక్షలు వద్దు.. రూ.1600లే ముద్దు.. వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం లీజు

By

Published : Jun 8, 2023, 12:21 PM IST

Land Issue in Kurnool: ఏడాదికి 29 లక్షల రూపాయల అద్దె వస్తుంటే.. వద్దొద్దు 1600 మాత్రమే చాలు అని ఎవరైనా అంటారా..? అక్షర జ్ఞానం లేనివారైనా సరే అంగీకరించరు.! కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కర్నూలులో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని.. వైసీపీ కార్యాలయానికి అప్పన్నంగా ఇచ్చేసిందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చే స్థలాన్ని.. లీజు పేరిట అధికార పార్టీకి ఎలా కట్టబెడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Land Issue in Kurnool
Land Issue in Kurnool

Land Issue in Kurnool: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎవరూ వదులుకోరు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైసీపీ కార్యాలయానికి ధారాదత్తం చేసింది. దీనిపై ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం తీసుకొచ్చే స్థలాన్ని.. లీజు పేరిట వైసీపీకి ఎలా కట్టబెడతారని స్థానికులు ప్రశ్నించారు.

కర్నూలు నగర నడిబొడ్డున రైల్వే స్టేషన్ మార్గంలో జలవనరుల శాఖకు చెందిన 3.40 ఎకరాల భూమిలో.. 1.60 ఎకరాల భూమిని ఏపీ ఆగ్రోస్‌ సంస్థకు కేటాయించారు. ఈ భూమి విలువ అక్షరాల వంద కోట్ల రూపాయల పైమాటే. ప్రభుత్వానికి.. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చే ఈ స్థలాన్ని.. నామమాత్రపు లీజుతో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కార్యాలయానికి కేటాయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఓ సంస్థకు ఇచ్చిన లీజులు రద్దు చేయకుండానే.. సదరు భూమిని వైసీపీ కార్యాలయానికి అప్పనంగా అప్పగించరాని ప్రజా సంఘాలు ఆగ్రహిస్తన్నాయి.

రైతుల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు.. ఏపీ ఆగ్రోస్‌ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగిస్తూ.. 1979లో అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 661 జారీ చేసింది. ఆగ్రోస్ సంస్థ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవటంతో... స్థలాన్ని తిరిగి ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులు పలుసార్లు లేఖలు రాసినా ఆగ్రోస్‌ నుంచి స్పందన లేదు. ఇదే అదునుగా ఖాళీగా ఉన్న ఏపీ ఆగ్రోస్‌ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించాలని కర్నూలు జిల్లా అధికార నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సీఎంవో అధికారులు సరేనన్నారు. ఇక అంతే.. ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున 1.60 ఎకరాలకు 1,600 రూపాయలు ఇచ్చేలా 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఫిబ్రవరి 16నజీవో ఇచ్చారనే ఆరోపణలున్నాయి. కోట్ల విలువైన భూమిని ప్రజావసరాలకు వినియోగించకుండా.. అధికార పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు..ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం 2012లోనే ప్రభుత్వం సదరు స్థలాన్ని తమకు కేటాయించిందంటూ.. మెస్సర్స్‌ ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తెర మీదకు వచ్చింది. ఏడాదికి 29 లక్షలు అద్దె చెల్లించేలా 33 ఏళ్ల పాటు లీజు ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లు.. చెప్తోంది. అందులో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, నియోటెక్‌ సొల్యూషన్స్‌, ఎస్వీ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు వాటాదారులు.

ఒప్పందం మేరకు ఆగ్రో ట్రేడర్ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి రుసుం చెల్లించింది. స్థలంలో వాణిజ్య భవనం నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇంతలో ప్రభుత్వం వైకాపా కార్యాలయానికి కేటాయించడంపై మెస్సర్స్‌ ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ సంస్థ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details