ఆంధ్రప్రదేశ్

andhra pradesh

state government ignored the support price : మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర.. ఇప్పటికీ మూడేళ్ల కిందటి ధరలే!

By

Published : Jun 14, 2023, 8:45 AM IST

state government ignored the support price : పంటలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధరల ప్రకటన ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఏటా సీజన్‌కు ముందే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పిన జగన్ మాట మరిచారు.. మడమ తిప్పేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. మూడేళ్ల క్రితం నాటి ధరలను మళ్లీ సవరించడానికి జగన్‌కు మనసొప్పలేదు. ఈ ఏడాది కేంద్రం ఇప్పటికే ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చడీచప్పుడు చేయడం లేదు. రైతులకు ఇచ్చే మద్దతు ఇదేనా అని కర్షకులు ప్రశ్నిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

మద్దతు ధర పట్టించుకోన జగన్ సర్కారు

state government ignored the support price : కేంద్రం మద్దతు ధరలివ్వని పంటలకు.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మద్దతు ధరల్ని ప్రకటించి, వాటిపైనే కొనుగోలు చేస్తుందని ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఏటా పంట వేసేముందు వాటికి మద్దతు ధరల్ని ప్రకటిస్తామని. గిట్టుబాటు ధరకు రైతన్నకు గ్యారెంటీ ఇస్తామని మేనిఫెస్టోలోనూ పెట్టారు.! కానీ ఆచరణలో మాత్రం మడమ తిప్పేశారు. అధికారంలోకొచ్చిన తొలి ఏడాది అంటే 2019-20 సంవత్సరంలో మాత్రమే మద్దతు ధరలు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర.. అప్పట్లో పత్రికల్లో ప్రకటనలూ గుప్పించారు. ఇక ఆ తర్వాత మద్దతు ధరల ప్రకటన ఊసేలేదు. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో వాటిని సమీక్షించలేదు. ఈ ఏడాదీ ఇప్పటి వరకూ మేలుకోలేదు. నాలుగేళ్లుగా వ్యవసాయ ఖర్చులు తడిసి మోపెడవుతున్నా పంటలకు కనీస మద్దతు ధర పెంచలేదు. కేంద్రం ఏటా జూన్‌లోనే మద్దతు ధరల్ని ప్రకటిస్తున్నా రాష్ట్రం మొద్దునిద్రలో జోగుతోంది.

పెరుగుతున్న ధరలు.. ఏటా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా.. పంటలకు మద్దతు ధరల్ని పెంచడం ప్రభుత్వాల కనీస బాధ్యత. పంట వేయడానికి ముందే... మద్దతు ధరల్ని పెంచి నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యవసాయ ఖర్చులు, ధరల జాతీయ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఖరీఫ్‌లో 14 పంటలకు మద్దతు ధరల్ని నిర్ణయిస్తోంది. వాస్తవ ఖర్చులతో పోలిస్తే పెంచేది అరకొరే అయినా ప్రకటనమాత్రం ఠంచనుగా జూన్‌లోనే ఇస్తోంది. కానీ జగన్‌ మాత్రం ఆ హామీని తుంగలో తొక్కేశారు.

పెట్టుబడి వ్యయం పెరిగినా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 జనవరి 9, 13 తేదీల్లో చిరుధాన్యాలతోపాటు పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి పంటలకు కనీస మద్దతు ధరల్ని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందులో మిర్చికి క్వింటా ధర 7 వేల రూపాయలుగా ప్రకటించింది. ప్రస్తుతం మిర్చి సాగుకు ఎకరాకు రెండున్నర లక్షల వరకూ ఖర్చవుతోంది. ఎకరాకు 15 క్వింటాళ్ల సగటు దిగుబడి లెక్కన చూసినా ఉత్పత్తి వ్యయమే క్వింటాకు రూ.17 వేల వరకు అవుతోంది. ఐనా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిర్ణయించిన రూ.7 వేలనే కొనసాగిస్తోంది. ఆ ధరకు అమ్ముకుంటే విత్తనం, సేద్య ఖర్చులూ రావని రైతులు వాపోతున్నారు. 2018-19తో పోలిస్తే ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు 30 నుంచి 50 శాతానికి పైగా పెరిగాయి. డీజిల్‌ ధరలు చుక్కలనంటగా.. పెట్టుబడి వ్యయం 50% వరకు పెరిగి ఉంటుందని అంచనా.

మూడేళ్ల నాటి ధరలే.. క్వింటాలు పసుపు ఉత్పత్తికి 2021-22 ధరల ప్రకారమే రూ.8,373 అవుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2020లో ప్రకటించిన 6 వేల 850 రూపాయలకే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇక అరటి, బత్తాయి, ఉల్లి పంటలకు.. కనీసం 100 శాతం పెంచితే తప్ప గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. డ్రాగన్‌ఫ్రూట్‌తోపాటు తైవాన్‌ జామ, దానిమ్మ, కోకో వంటి కొత్త రకం పంటలు సాగు చేస్తున్నా... మద్దతు ధరలివ్వాలనే విషయాన్నీ వైఎస్సార్సీపీ సర్కార్‌ విస్మరించింది.

రైతులపై పట్టింపేదీ.. ఇక చిరుధాన్యాలు పండించే రైతులపై ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే చెప్పుకోవాలి. ఈ ఏడాది రాగులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 3వేల846 చొప్పున ధర నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే క్వింటాలుకు రూ.268 పెంచింది. జొన్నలకు కూడా హైబ్రిడ్‌ రకం రూ.210, నాటు రకాలకు రూ.235 చొప్పున పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరిక తదితర చిరుధాన్యాలను 2019-20లో ప్రకటించిన మద్దతు ధర2వేల500ప్రకారమే అమ్ముకోమంటోంది.

ABOUT THE AUTHOR

...view details