ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ED raids in MP Magunta House: దిల్లీ మద్యం వ్యవహారం.. ఎంపీ మాగుంట ఇళ్లలో ఈడీ సోదాలు

By

Published : Sep 16, 2022, 1:16 PM IST

Updated : Sep 17, 2022, 7:32 AM IST

EDraids
ఈడీ సోదాలు ()

ED raids in MP Magunta House: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులు.. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన నివాసాలు, పరిశ్రమల్లో విస్తృత సోదాలు చేపట్టారు. దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం

ED raids in MP Magunta Srinivasulureddy House: దిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దిల్లీలోని 40 చోట్ల సోదాలు నిర్వహించింది. మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు చేసింది. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన దిల్లీ, చెన్నై, నెల్లూరుల్లోని నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాకు ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఈడీ అధికారులు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రాయాజీ వీధిలోని మాగుంట కార్యాలయానికి చేరుకున్న ఈడీ అధికారులు.. దస్త్రాలను పరిశీలించి, కార్యాలయ సిబ్బందిని విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరో బృందం వచ్చి.. సర్వేపల్లి, సింగరాయకొండలోని లిక్కర్‌ కంపెనీల దస్త్రాలను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. బీరువాలు, లాకర్లకు తాళాలు వేసి ఉండటంతో వాటిని పగలగొట్టేందుకు బయట నుంచి వ్యక్తిని తీసుకెళ్లారు.

బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో ఉంటున్న మాగుంట బంధువు ఏటూరు శివరామకృష్ణారెడ్డి ఇంట్లో మరో బృందం సోదాలు నిర్వహించింది. ఇంట్లోని వారిని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ట్రైడెంట్‌ చిమర్‌ లిమిటెడ్‌ సంస్థలోనూ తనిఖీలు జరిగాయి. మాగుంటకే చెందినవని భావిస్తున్న చెన్నైలోని ఏంజెల్స్‌ షాంపైన్‌ ఎల్‌ఎల్‌పీ, తమిళనాడు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల్లోనూ ఈడీ సోదాలు జరిగాయని తెలిసింది.

ఈ నెల 6న దేశవ్యాప్తంగా 40 స్థావరాల్లో సోదాలు చేసిన ఈడీ.. శుక్రవారం ఉదయం నుంచే పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని వెంటబెట్టుకొని రెండో విడత తనిఖీలు చేపట్టింది. పది రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండోసారి పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితునిగా పేర్కొంటున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైకు చెందిన కోకాపేట ఇంట్లో సీబీఐ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేశారు. రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ, రాబిన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లలో ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయా సంస్థల్లో హైదరాబాద్‌కే చెందిన అభిషేక్‌ బోయినపల్లి, ప్రేమ్‌సాగర్‌ గండ్ర సహ డైరెక్టర్లుగా ఉన్నారు. దిల్లీలో మద్యం సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో ఈ రెండూ ఉన్నాయని, ఇందుకోసం తెరచాటు వ్యవహారం నడిపాయని, దీని ద్వారా అనేకమంది లబ్ధి పొందారన్నది దర్యాప్తు సంస్థల అనుమానం. పిళ్లైతో కలిసి వ్యాపారాలు నిర్వహించిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన ఈడీ అధికారులు కొన్ని కీలక దస్త్రాలు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దిల్లీ, నెల్లూరులోని వైకాపా ఎంపీ ఇళ్లలో ఈడీ సోదాలు


ఇవీ చదవండి:

Last Updated :Sep 17, 2022, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details