ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP Government Negligence on AIIB Projects: ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తానని చెప్పి.. నిధులు ఇవ్వకపోతే ఎలా జగననన్నా..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 10:29 AM IST

YSRCP Government Negligence on AIIB Projects: జగనన్న మాటిచ్చారంటే.. చేస్తారంతే అంటూ వైసీపీ నేతలు ఊదరగొడతారు. అన్నొచ్చాడు మంచి రోజులు వచ్చాయి అంటూ జగన్‌ కూడా డప్పుకొట్టుంటూరు. కానీ.. నాలుగేళ్లగా కనీసం మంచి నీరూ అందక ప్రజలు అవస్థలు పడుకున్నారు. పట్టణాల్లో ఏఐఐబీ ప్రాజెక్టులపై వైసీపీ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం, గుత్తేదారులకు బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో.. ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది పరిస్థితి.

YSRCP Government Negligence on AIIB Projects
YSRCP Government Negligence on AIIB Projects

YSRCP Government Negligence on AIIB Projects: ప్రతి ఇంటికీ రోజూ తాగునీరు అందించాలని.. 2022 మే 9న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షలో సీఎం జగన్ అన్నారు. మంచి నీటి సరఫరా వ్యవస్థపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉంటే ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునే వీలుంటుందని ఘనంగా చెప్పారు. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తే జగన్ మాటలు అచ్చంగా నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్టుగా ఉన్నాయి.

తాగునీటి సరఫరా పక్కాగా జరగాలని చెబుతూనే.. అందుకు సంబంధించిన పనులకు నిధుల విడుదలతో తీవ్ర నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరు నిస్సందేహంగా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగు కోసం చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి.. నాలుగేళ్లలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రం ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. గుత్తేదారులకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.

State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు

టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 50 పట్టణాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం.. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టే ఈ ప్రాజెక్టును ఏఐఐబీ (Asian Infrastructure Investment Bank) 2018 డిసెంబరులో ఆమోదించి, ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.

మొత్తం నిధుల్లో 70శాతం బ్యాంకు, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదిరింది. మొత్తం 20 ప్రాజెక్టులలో.. 18 తాగునీటి సరఫరా, 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటును 2024 జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలోనే పనులు చేపట్టినా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు ఒక్క పనీ పూర్తికాలేదు.

Water Problem in Guntur: అధికారుల ప్రణాళికా లోపం.. ప్రజలకు శాపం..

కృష్ణా జిల్లాలో తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, పెడన పురపాలక సంఘాల్లో 488 కోట్ల పనులు ప్రతిపాదించగా, పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కృష్ణా నది నుంచి ఉయ్యూరుకు పైప్​ లైన్ నిర్మాణం ఇంకా మొదలు పెట్టలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 148 కోట్ల రూపాయలతో దాదాపు 82 కిలోమీటర్ల పొడవు పైపులైన్, నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదించారు. కానీ.. నిధుల కొరతతో పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి.

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోనూ 34.97 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు 30 శాతానికి మించి పూర్తి కాలేదు. చంపావతి నదిలో బావుల తవ్వకంతోనే నిలిచిపోయాయి. రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం, ఇళ్లకు కుళాయి కనెక్షన్ల వంటి పనులు గడువు ముగిసేలోగా పూర్తవుతాయో, లేదోనన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Water Problem In Marutla: దాహం..దాహం..తారస్థాయికి చేరిన తాగనీటి ఇక్కట్లు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 61.38 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులదీ ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో పాత పైపులైన్ల స్థానంలో కొత్త నిర్మాణ పనులు ప్రారంభించి, నిధుల లేమితో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఏఐఐబీ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గుత్తేదారులకు 220 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో పలుచోట్ల పనులు నిలిపివేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏఐఐబీ నిపుణుల బృందం నిధుల విడుదలలో ఆలస్యం వల్ల పనులపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ 2023 మేలో నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు.

Water Problem: బిందె నీటి కోసం.. 3 కిలోమీటర్లు నడిచి.. 3 గంటలు నిరీక్షించి

ABOUT THE AUTHOR

...view details