ETV Bharat / state

Water Problem in Guntur: అధికారుల ప్రణాళికా లోపం.. ప్రజలకు శాపం..

author img

By

Published : Jun 23, 2023, 10:39 AM IST

Water Problem in Guntur: గుంటూరు శివారు కాలనీలను తాగునీటి సమస్య వేధిస్తోంది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు సరైన ప్రణాళిక వేయకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే నీరు వచ్చే ప్రాంతాలు కొన్నయితే... మరికొన్ని చోట్ల రాత్రి వేళల్లో నీటిని వదలటం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నగరంలో 24 గంటల తాగునీటి పథకానికి సంబంధించి నిర్మాణం పూర్తయినా పైపు లైన్లను అనుసంధానించడంలో నెలకొన్న జాప్యం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది.

Etv Bharat
Etv Bharat

ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్య

Water Crisis Looms in Guntur : రాష్ట్రంలోని పెద్ద నగరపాలక సంస్థల్లో గుంటూరు ఒకటి. ఇక్కడ 10 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా తాగునీటి సరఫరా వ్యవస్థను విస్తరించటంలో నగరపాలక సంస్థ పాలకమండలి, అధికారులు విఫలమయ్యారు.

మంచినీటి కోసం అల్లాడిపోతున్న ప్రజలు : దీంతో నగరంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం నెలకొంది. వేసవి కావటంతో నీటి అవసరాలు పెరిగాయి. ఆ మేరకు సరఫరా లేకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. జనాభా ప్రాతిపదికన చూస్తే రోజుకు 120 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రకాశం బ్యారేజితో పాటు కృష్ణా కాలువల నుంచి నీటిని పంపింగ్ చేసి పైపు లైన్ల ద్వారా నగరానికి సరఫరా చేస్తారు. అయితే పంపింగ్ వ్యవస్థతో పాటు నీటి శుద్ధి వ్యవస్థ సరిగా లేకపోవటంతో నిర్దేశించిన దానిలో 70శాతం మాత్రమే నీరు సరఫరా చేయగలుగుతున్నారు. దీంతో శివారు కాలనీలలో నివశించేవారు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు.

నగపాలక సంస్థదే బాధ్యత : నగరంలోని ఎస్వీఎన్ కాలనీ, ఇన్నర్ రింగురోడ్డు, స్వర్ణభారత్ నగర్ ఇలా అనేక ప్రాంతాల్లోని ప్రజలు గత రెండుమూడు నెలలుగా మంచి నీటి కోసం నరకయాతన పడుతున్నారు. నిత్యం నీటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఏ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు అందించే కనీస బాధ్యత నగపాలక సంస్థదే. కానీ ఆ విషయంలో యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పాలకమండలిపై విమర్శలు : వాస్తవానికి గుంటూరు నగరానికి 24 గంటల నీటి సరఫరా కోసం సమగ్ర తాగునీటి ప్రాజెక్టు మంజూరైంది. దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం జరిగినా వాటిని పూర్తిస్థాయిలో అనుసంధానించలేదు. ప్రస్తుతం వేసవి కాలం కావటంతో సమస్య మరింతగా పెరిగింది. నగరపాలక సంస్థ పంపించే ట్యాంకర్లు మూడు, నాలుగు రోజులకు ఓసారి గానీ రావటం లేదు. ట్యాంకర్ రాని రోజుల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు సైతం డబ్బులు వెచ్చించి మరీ తాగునీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితికి అధికారులు, పాలకమండలి కారణమని విమర్శిస్తున్నారు. తాత్కాలిక సర్దుబాట్లు కాకుండా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరా ప్రణాళిక అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ నీటి ట్యాంకర్ల వారు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ధరలు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వేసవి కావటంతో డబ్బులు పోయినా ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని వినియోగించుకోవాల్సి వస్తోంది.

'నీటి కోసం ఫోన్ చేసిన సరైనా స్పందన ఉండటం లేదు. నీళ్లు నెలకు ఐదు, ఆరు రోజులు మాత్రమే వస్తున్నాయి. మంచి నీరు చెడు వాసన వస్తున్నాయి. నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాము.'- గుంటూరు ప్రజలు

Lokesh solved water problem: టిడ్కో ఇళ్ల సముదాయంలో నీటి సమస్య.. తీర్చిన యువనేత లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.