ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Situation Of Krishna West Delta Canals: అధ్వానంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు..నీరు పారేదెలా?

By

Published : May 19, 2023, 8:02 AM IST

Situation Of Krishna West Delta Canals
అధ్వానంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు ()

Situation Of Krishna West Delta Canals: తుప్పుపట్టిన గేట్లు, కదలని లాకులు, నెర్రెలిచ్చిన కాలువ గట్లు, ఇదీ మూడు ముక్కల్లో కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగునీటి సౌకర్యాల దుస్థితి..! నాలుగేళ్లుగా కనీస నిర్వహణ లేక.. కాలువల వెంట లీకేజీలు, డ్యామేజీలే కనిపిస్తున్నాయి. ఏటా వేసవిలో మరమ్మతులు చేపట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. నీటి తీరువా వసూలు కాలేదనే సాకుతో పనుల్ని పక్కనపట్టేసింది.

అధ్వానంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు

Situation Of Krishna West Delta Canals : ప్రకాశం బ్యారేజి నుంచి కాలువల ద్వారా విడుదలయ్యే నీటితో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సాగయ్యే ఆయకట్టుని కృష్ణా పశ్చిమ డెల్టాగా వ్యవహరిస్తారు. బ్యారేజి కుడి వైపు నుంచి వచ్చే ప్రధాన కాలువతో పాటు గుంటూరు ఛానల్ ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. ప్రధాన కాలువ దుగ్గిరాల వరకూ వచ్చి అక్కడి నుంచి హైలెవల్ ఛానల్, తూర్పుకాల్వ, నిజాంపట్నం కాల్వ, పశ్చిమ కాల్వ, కృష్ణా పశ్చిమ కాలువ, కొమ్మమూరు కాల్వలుగా విడిపోతుంది.

కాలువ మరమ్మతులు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : గుంటూరు ఛానల్ ప్రకాశం బ్యారేజి వద్ద మొదలై వట్టి చెరుకూరు మండలం గారపాడు వరకు ప్రవహిస్తుంది. ఈ కాలువల ద్వారా వచ్చే నీరే 2జిల్లాల్లోని 5లక్షల 72 వేల ఎకరాల సాగుకు ఆధారం. ఏటా జూన్‌లో కాలువలకు నీరు విడుదల చేస్తారు. దీనికి ముందే కాలువలు, షట్టర్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా కాలువల మరమ్మతులే చేయలేదు. గేట్లు తుప్పుపట్టి పాడైపోయాయి. గేట్లు మూసేసినా లీకేజిల రూపంలో బయటకు వస్తున్నాయి.

ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి :దుగ్గిరాల, కొల్లూరు లాకులు మరీ శిథిలావస్థకుచేరాయి.గేట్లుతుప్పుపట్టడంతో తాళ్లతో కట్టేశారు. కొమ్మమూరు కాలువ అధ్వానంగా తయారైంది. 2008లో 410కోట్లతో ఆధునికీకరణ పనులు తలపెట్టినా 30కోట్ల విలువైనా పనులైనా పూర్తి కాకుండా అర్ధాంతరంగా ఆపేశారు. అప్పట్నుంచి తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి.

పంటలు పాడయ్యే ప్రమాదం : ప్రకాశం బ్యారేజీ నుంచి మొదలై తాడేపల్లి-మంగళగిరి, గుంటూరు నగరపాలక సంస్థలు, కాలువ వెంట ఉన్న గ్రామాలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించే గుంటూరువాహిని అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ తూటుకాడ పెరిగింది. డ్రెయిన్లు పూడిక, పిచ్చిమొక్కలతో నిండి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. డ్రెయిన్లు సరిగా లేకపోతే వర్షాల సమయంలో పొలాల్లో నీరు సముద్రంలోకి వెళ్లదు. ఫలితంగా పంటలు పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది. నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్య ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు.

షరుతు విధించిన ప్రభుత్వం :ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేవీ రాకపోవడంతో నీటి తీరువా నిధులతోనే అధికారులు పనులు చేపడుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 21కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం అనుమతించింది. అయితే నీటి తీరువా సొమ్ము 7 కోట్ల 60లక్షలే వసూలైంది. రైతుల నుంచి ఇంకా రూ.12కోట్ల వరకూ వసూలు చేయాల్సి ఉంది. అది వసూలు చేసుకుని మరమ్మతులు చేసుకోవాలని ప్రభుత్వం షరతు విధించింది. గతంలో చేసిన పనులకు బిల్లులు బకాయి పెట్టడంతో గుత్తేదార్లు మళ్లీ పనులు చేపట్టడం అనుమానమే.


ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details