లక్షకు పైగా జనం ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో కూరగాయల మార్కెట్ అందుబాటులో లేదు. గతంలో మంగళగిరి డిగ్రీ కళాశాల ఎదురుగా మార్కెట్ ఉండేది. అక్కడ నూతన భవనాల నిర్మాణం కోసం 2018డిసెంబర్ 14 న శంకుస్థాపన చేశారు. మార్కెట్ను తాత్కాలికంగా మహంకాళి ఆలయం రోడ్డులోకి మార్చారు. కొద్ది రోజులే కదా మళ్లీ ఇక్కడకు వస్తామని వ్యాపారాలు కూడా అంగీకరించారు. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు మొదలుపెట్టారు. కోటి 50 లక్షల అంచనాతో పనులు ప్రారంభమై పునాదుల వరకు పూర్తయ్యాక ప్రభుత్వం మారిపోయింది. అంతే...పనులు ఆగిపోయాయి. మూడేళ్లయినా పునాదులపై ఒక్క ఇటుక రాయి పడలేదు.
మార్కెట్ ఇంకా అందుబాటులోకి రాక.. వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చిందంటే తాత్కాలికమార్కెట్ అంతా చిత్తడి అవుతోదంని వాపోతున్నారు. గతంలో కూరగాయల మార్కెట్ ఉన్న ప్రాంతానికి పక్కనే ఇతర దుకాణాలూ ఉండేవి. అన్ని రకాల సరుకులు, కూరగాయలు ఒకేచోట లభించేవి. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. సాయంత్రం తర్వాత మార్కెట్ కు వచ్చే పరిస్థితి లేదు. కూరగాయలు ఒకచోట, సరుకులు మరోచోట తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు.
నగరపాలక సంస్థ అధికారుల వాదన మరోలా ఉంది. కొత్తగా నిర్మిస్తున్న భవనం పక్కన మరో దుకాణ సముదాయం శిథిలావస్థకు చేరుకుందని దాన్ని కూడా తొలగించి మరింత విశాలంగా మార్కెట్ కట్టిస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని.. అనుమతి రావాల్సి ఉందంటున్నారు.
ఇదీ చదవండి:గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ భర్తపై సీబీఐ కేసు.. ఎందుకంటే..?