ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagajjanani Chit Fund Case: జగజ్జనని చిట్‌ఫండ్‌.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు బెయిల్​..

By

Published : May 10, 2023, 12:20 PM IST

Bail to Adireddy Apparao in Jagajjanani Case: జగజ్జనని చిట్‌ఫండ్‌ కేసులో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు శ్రీనివాస్‌ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం వాదనలు ముగియగా.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

Bail to Aadireddy Apparao
Bail to Aadireddy Apparao

Bail to Adireddy Apparao in Jagajjanani Case: జగజ్జనని చిట్‌ ఫండ్‌ కేసులో అరెస్ట్​ అయిన తెలుగుదేశం నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుకు హైకోర్టులో ఉపశమనం లభించింది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జగజ్జనని చిట్‌ ఫండ్‌ కేసులో ఇద్దరిపై CID కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీఐడీ పేర్కొంది. బెయిల్‌ కోసం అప్పారావు, వాసు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. చిట్‌ ఫండ్‌ చట్టం ఈ కేసుకు వర్తించదని.. పిటిషనర్లు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. డిపాజిట్‌దారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు సోమవారం నాడు బెయిల్​ పిటిషన్​పై వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది.

సోమవారం నాడు సాగిన వాదనలు ఇలా ఉన్నాయి.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. చిట్‌ నిర్వహణలో ఏదైనా లోపాలను చిట్‌ సహాయ రిజిస్ట్రార్‌ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్‌ వ్యవహరించారన్నారు. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషన్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందన్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీలలో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు.

చిన్న లోపాలు ఏమైనా చోటు చేసుకుంటే అవి చిట్‌ ఫండ్‌ చట్ట పరిధిలోకి వస్తాయన్నారు. ‘డిపాజిటర్ల చట్టం’ వర్తించదన్నారు. సొమ్ము తిరిగి చెల్లింపు వ్యవహారంపై ఏ ఒక్క చందాదారుకు అభ్యంతరం లేదన్నారు. గతంలో విచారణ నిమ్తితం అధికారులు పిలిస్తే పిటిషనర్‌ వెళ్లి సహకరించారన్నారు. అరెస్ట్‌ విషయంలో తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పట్టించుకోలేదన్నారు. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను దిగువ కోర్టు తోసిపుచ్చిందన్నారు. రికార్డులన్ని ఇప్పటికే చిట్‌ రిజిస్ట్రార్ల వద్ద ఉన్నాయన్నారు. దర్యాప్తు పేరుచెప్పి పిటిషనర్లను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఐపీసీ సెక్షన్‌ 409, డిపాజిటర్ల చట్టం సెక్షన్‌ 5 ఈ కేసుకు వర్తించదన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు.

సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బెయిలు ఇవ్వొద్దని కోరారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు డిపాజిటర్ల చట్టం ఏవిధంగా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. చందాదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులేట్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం నేడు బెయిల్​ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details