Ammaodi Scheme Restrictions: అన్నింటిలాగే అమ్మఒడి పథకంలోనూ సీఎం జగన్.. కోతల్లో తనదైన మార్క్ చూపించారు. ఎన్నికలకు ముందు పిల్లల్ని బడికి పంపితే చాలు రూ.15 వేలంటూ చెప్పి.. తర్వాత ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే అని మాట మార్చారు. తర్వాతా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు పలు నిబంధనలు పెట్టారు. ఫలితంగా మొదటి ఏడాది తప్ప ఎప్పుడూ రూ.15 వేల పూర్తిమొత్తం తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. మొదటి ఏడాది సైతం బ్యాంకులో జమ చేసిన తర్వాత మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి వెనక్కి తీసుకున్నారు. రెండో ఏడాది నేరుగా వెయ్యి రూపాయలు మినహాయించి రూ.14 వేలే వేశారు.
గతేడాది నుంచి మరుగుదొడ్లకు తోడు పాఠశాలల నిర్వహణనూ జత చేసి ఏకంగా రూ.2 వేలు కోత వేస్తున్నారు. ఈ ఏడాది విచిత్రమేమిటంటే కొంతమందికి రూ.13 వేలు, కొందరికి రూ.11 వేలు, రూ.9 వేలు, రూ.5 వేలు చొప్పున జమ చేయడంతో.. అర్థం కాక లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. మొదట రూ.9 వేలు వేసిన వారిలో కొందరికి మిగతా రూ.4 వేలు వేశారు. మరికొందరికి ఇప్పటికీ మిగతా మొత్తం పడలేదు. అమ్మఒడి సైతం రెండు విడతలుగా జమ చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు రూ.2 వేల కోతపైనా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చులు పేదలే భరించాలా.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేదలు అని మాట్లాడే జగన్ వారి కోసం ఆ మాత్రం నిధులను ఖర్చు చేయలేరా? అని తల్లులు ప్రశ్నిస్తున్నారు.