ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చికిత్స అందకుంటే మరణమే.. కనీసం పింఛను ఇప్పించండి'

By

Published : Jun 10, 2020, 7:20 AM IST

అతనిది నిరుపేద కుంటుంబం. ఒకప్పుడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. అనారోగ్యం అతన్ని మంచాన పడేసింది. తన కుటుంబానికి ఆసరా లేకుండా చేసింది. గతంలో తన దయనీయ పరిస్థితిని ఎన్నికల ముందు పాదయాత్రకు వచ్చిన ఇప్పటి సీఎం జగన్ కు వివరించాడు. ఇప్పుడు కనీసం పింఛను అయినా ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు.

health problem
health problem

ఇతని పేరు పురాకుల రాజశేఖర్‌. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సత్తెమ్మ కాలనీవాసి. రాజశేఖర్‌ చిన్నప్పటి నుంచి అందరిలాగానే చలాకీగా ఉండేవాడు. వివాహం అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇతని ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. పరీక్ష చేసిన వైద్యులు గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయని చెప్పారు. మార్పిడి చేయాలని.. కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని అన్నారు.

సాధారణ పనులతో పాటు.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు రాజశేఖర్‌. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో అప్పులు చేసి మరీ బాగుచేయించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజురోజుకూ అతని పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. రాజశేఖర్‌ తన దయనీయ పరిస్థితి గురించి గతంలో పాదయాత్రలో పెద్దాపురం వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత... ఇప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డికి వివరించాడు. జగన్‌ తనను ఆదుకుంటానని పూర్తి భరోసా ఇచ్చారని.. కనీసం తనకు పింఛను ఇచ్చి తన కుటుంబానికి అండగా నిలవాలని వేడుకుంటున్నాడు.

రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. చికిత్స అందకపోతే చనిపోతాడని డాక్టర్లు చెబుతున్నారు. ఇతనికి 'మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ బృందం' సభ్యులు, స్నేహితులు తోచిన రీతిలో సాయం అందించారు. అయినా అది ఏ మాత్రం సరిపోలేదు. ప్రస్తుతం అతని‌ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా మారింది.

రాజశేఖర్‌ తనకు పింఛను ఇప్పించాలని కలెక్టర్‌ కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి వేడుకున్నాడు. సీఎం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రిని కలిసే అవకాశం అతనికి రాకపోవడంతో వెనుదిరిగాడు. ప్రస్తుతం అతని భార్య పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అధికారులు స్పందిస్తే తప్ప.. వారి సమస్యలు తీరేలా కనిపించడం లేదు.

ఇదీ చదవండి:'అర్హులకు పథకాలు అందకపోతే.. పరిహారమివ్వాల్సిందే..!'

ABOUT THE AUTHOR

...view details