చిత్తూరు జిల్లా వాసులకు హంద్రీనీవా వరప్రదాయని. కృష్ణా జలాలతో ప్రవహిస్తూ... ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తుంది. కొన్నేళ్లుగా హంద్రీనీవాపై కాలువ నిర్మాణ పనులు కొనసాగుతున్నా... ఇరువైపుల ఉన్న గ్రామాల ప్రజల కష్టాలను అధికారులు పట్టించుకోవడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దతిప్ప సముద్రం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లి మండలాల మీదుగా కుప్పం వరకు అన్ని రకాల పనులను గుత్తేదారులకు అప్పగించారు.
కాలువపై అక్కడక్కడ వంతెనలు నిర్మించాలన్న ఆలోచన మాత్రం చేయలేదు. కాలువలకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర కష్టాలు పడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో 18 ఆవాస ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల నిర్మించి... అసంపూర్తిగా ఉన్న కాలువ గేట్లపై తాత్కాలికంగా వంతెనలు ఏర్పాటు చేసుకొని ప్రమాదపు అంచుల్లో ప్రయాణం సాగిస్తున్నారు.