ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దసరా ఉత్సవాలు: నేడు అన్నపూర్ణా, మహాలక్ష్మీదేవి రూపాల్లో అమ్మవారు

By

Published : Oct 11, 2021, 7:18 AM IST

vijayawada

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది పరిశీలించి అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు.

బెజవాడ దుర్గ గుడిలో దసరా వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.

నేటి ఉదయం అన్నపూర్ణాదేవి..

ఉత్సవాల ఐదో రోజు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం ఉండదని ప్రతీతి.

మధ్యాహ్నం మహాలక్ష్మీదేవి రూపం..

సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి దుర్గమ్మ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం.ూరగాయలు కొనలేం


ఏర్పాట్లు బాగుండాలి.. సీఎం పట్టువస్త్రాల సమర్పణపై సమీక్ష

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగాంగా ఈనెల 12న మూలానక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ అధికారులకు సూచించారు. దుర్గగుడి ఈవో కార్యాలయంలో ఏడీసీలు, ఆర్జేసీలతో ముఖ్యమంత్రి పర్యటనకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆదివారం సమీక్షించారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు దేవదాయ శాఖ తరఫున స్వాగతం పలికి చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణ, అంతరాలయంలో పూజలు, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగత ఏర్పాట్లు చేయాలని ఈవోకు ఆదేశాలు ఇచ్చారు. చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ చంద్రకుమార్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆర్జేసీలు సాగర్‌బాబు, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, అన్నవరం, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.


భక్తుల వైద్యసేవలకు..

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని తెలిపారు. 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 24 గంటలూ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులకు వైద్యం అందించేందుకు నిపుణుల బృందంతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అత్యవసర కేసులను రెఫరల్‌ ఆసుపత్రులకు తరలించడానికి మూడు అంబులెన్స్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచామన్నారు.

ఇదీ చదవండి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం

ABOUT THE AUTHOR

...view details