ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPS Issue: 'చలో విజయవాడ' వాయిదా వేసినా ఆగని నిర్బంధాలు

By

Published : Aug 30, 2022, 10:06 PM IST

CPS EMPLOYEES APPEAL: 'చలో విజయవాడ' వాయిదా వేసినా.. ఉద్యోగుల నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగ నేతలు, ఉపాధ్యాయులపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు. హక్కుల కోసం పోరాడితే.. కక్ష సాధింపేంటని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు.

CPS EMPLOYEES APPEAL
CPS EMPLOYEES APPEAL

చలో విజయవాడ వాయిదా వేసినా ఆగని నిర్బంధాలు

CPS EMPLOYEES: ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగులను ఇంకా అరెస్టులు చేస్తున్నారని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అప్పలరాజు ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్టు నిన్ననే ప్రకటన జారీ చేసినట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్‌లు చేసి పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 1ని సీపీఏఎస్‌ ఉద్యోగులు ఏటా చీకటిదినంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మరో సంఘం చేసిన ప్రకటనల వల్లే శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించబోమని డీజీపీకి హామీ ఇస్తున్నామని చెప్పారు. పోలీసులు తీసుకెళ్లిన సీపీఎస్ ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అప్పలరాజు అన్నారు.

చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసినా.. ఉద్యోగులకు నిర్బంధాలు తప్పడం లేదు. అడుగడుగునా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు నిర్బంధించారు. పార్వతీపురంలో ఉదయపు నడకకు వెళ్లిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పాఠశాలలకు వెళ్లాలని చెబుతున్నా వినకుండా.. సుమారు 3గంటల పాటు స్టేషన్ ఆవరణలో ఉంచారు. సెప్టెంబర్ 1న ఆందోళనలు చేయమని.. రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి చేశారని గురువులు వాపోయారు.

తిరుపతి జిల్లా నాయుడుపేట స్టేషన్ ఎదుట టీచర్లు ధర్నా చేపట్టారు. తమ నాయకుడు బాలసుబ్రహ్మణ్యంను సోమవారం సాయంత్రం నుంచి పోలీసుస్టేషన్‌లోనే ఉంచారంటూ ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. నెల్లూరులోనూ అదే పరిస్థితి. టీచర్లను చిన్నబజార్ స్టేషన్‌లో ఉంచడంతో.. బహుజన ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన తెలిపారు. ఉద్యమం వాయిదా వేసినా నిర్బంధాలేంటని ప్రశ్నించారు.

సీపీఎస్​ రద్దే లక్ష్యంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. టీచర్లను స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారని.. బైండోవర్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ కాలంలోనూ ఇన్ని నిర్బంధాలు లేవని ఆక్షేపించారు. అక్రమ నిర్బంధాలకు నిరసనగా.. ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ.. ఉద్యోగులను ప్రభుత్వం నిర్బంధిస్తోందని.. కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కమిటీల పేరుతో మూడేళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు జీపీఎస్​ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధించిన ఉద్యోగులను విడుదల చేయాలంటూ.. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎమ్మెల్సీలు వినతిపత్రం అందజేశారు. బంధించిన వారి వాహనాలనూ వదిలేయాలని కోరారు. తమ విన్నపాలపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీలు తెలిపారు.

Babu letter to CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ:సీపీఎస్ ఉద్యోగులపై వేధింపులు, కేసులు ఆపాలంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని జగన్‌ వాగ్దానం చేశారని.. ఆ హామీ నెరవేర్చలేదని ఉద్యోగులు నిరసన బాటపట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. శాంతియుత నిరసనలు.. ఉద్యోగులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కని తెలిపిన చంద్రబాబు.. నోటీసులు, బైండోవర్ కేసులతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఉద్యోగులు నిరసన వాయిదా వేసినా వేధింపులు ఆగట్లేదన్న చంద్రబాబు.. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులపై వేధింపులను నిలిపివేయాలని సీఎస్‌కు రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details