ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PRC Issue: సమ్మెలో పాల్గొంటాం: వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు

By

Published : Jan 31, 2022, 8:47 PM IST

Medical Employee Unions On PRC: అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉద్యమంలో పాల్గొంటామని వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.

సమ్మెలో పాల్గొంటాం
సమ్మెలో పాల్గొంటాం

Medical Employee Unions On PRC: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెలో తాము పాల్గొంటామని వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విజయవాడలో సమావేశమైన వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు.. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని ప్రకటించారు. అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ఉద్యమంలో పాల్గొంటామని నేతలు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. వైద్య సిబ్బంది సమ్మెకు దిగితే తలెత్తబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.

లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం..

Employee union Leaders on PRC: ప్రభుత్వం చర్చల పేరిట ఉద్యోగులను పక్కదోవ పట్టించిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు. నివేదికలో ఉన్న రహస్యమేంటో తెలపాలన్నారు. కొత్త పీఆర్సీ వల్ల రూ.10,600 కోట్లు ఖర్చవుతుందని.. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి..

ఇకనుంచి లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 3న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ఆ కార్యక్రమానికి ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, పింఛనర్లు అందరూ తరలిరావాలని కోరారు. ప్రభుత్వం చేసిన కుట్రలను గమనించి ఉద్యోగుల ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలన్నారు. న్యాయ సలహాలు ఇచ్చేందుకు సాధన సమితి పక్షాన ఇద్దరు న్యాయవాదులు రవిప్రసాద్‌, సత్యప్రసాద్‌లను నియమించుకున్నట్లు వెల్లడించారు.

"లిఖితపూర్వక ఆహ్వానం ఇస్తేనే చర్చలకు వెళ్తాం. జీవోల రద్దు, పాతనెల జీతం, కమిటీ నివేదిక..ఇవే ప్రధాన డిమాండ్లు. మేం చర్చలకు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధ జీవోలను పక్కనపెట్టి పాత జీతాలు ఇవ్వాలని కోరాం. మా సాధన సమితి పక్షాన ఇద్దరు లాయర్లను నియమించుకుంటున్నాం. వచ్చే నెల 3న 'చలో విజయవాడ' చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రభుత్వం చేసిన కుట్రలను అందరూ గమనించాలి. ఉద్యోగులందరూ తమ ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలి."-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్

భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..

ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. జీతాల బిల్లుల తయారీ కోసం ట్రెజరీ అధికారుల మెడపై కత్తి పెట్టారని ఆక్షేపించారు. ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా మెమోలు జారీ చేస్తున్నారన్నారు. ఉద్యోగులపై ఇష్టానుసారం చర్యలు తీసుకునేందుకు ఇది ఆటవిక రాజ్యం కాదని హితవు పలికారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలతో అధికారులపై చర్యలు తీసుకోవద్దని కోరారు. చర్చలకు రావాలని ఒకసారి వాట్సప్‌ మెసేజ్ మాత్రమే పంపారని..,ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారని వాపోయారు.

ఇదీ చదవండి

PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

ABOUT THE AUTHOR

...view details