ETV Bharat / city

PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

author img

By

Published : Jan 31, 2022, 7:16 PM IST

PRC: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నివేదికలో ఉన్న రహస్యమేంటో తెలపాలని నేతలు డిమాండ్ చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల నేతలు

Employee union Leaders on PRC: ప్రభుత్వం చర్చల పేరిట ఉద్యోగులను పక్కదోవ పట్టించిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు. నివేదికలో ఉన్న రహస్యమేంటో తెలపాలన్నారు. కొత్త పీఆర్సీ వల్ల రూ.10,600 కోట్లు ఖర్చవుతుందని.. పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి..

ఇకనుంచి లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 3న చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ఆ కార్యక్రమానికి ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, పింఛనర్లు అందరూ తరలిరావాలని కోరారు. ప్రభుత్వం చేసిన కుట్రలను గమనించి ఉద్యోగుల ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలన్నారు. న్యాయ సలహాలు ఇచ్చేందుకు సాధన సమితి పక్షాన ఇద్దరు న్యాయవాదులు రవిప్రసాద్‌, సత్యప్రసాద్‌లను నియమించుకున్నట్లు వెల్లడించారు.

"లిఖితపూర్వక ఆహ్వానం ఇస్తేనే చర్చలకు వెళ్తాం. జీవోల రద్దు, పాతనెల జీతం, కమిటీ నివేదిక..ఇవే ప్రధాన డిమాండ్లు. మేం చర్చలకు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధ జీవోలను పక్కనపెట్టి పాత జీతాలు ఇవ్వాలని కోరాం. మా సాధన సమితి పక్షాన ఇద్దరు లాయర్లను నియమించుకుంటున్నాం. వచ్చే నెల 3న 'చలో విజయవాడ' చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రభుత్వం చేసిన కుట్రలను అందరూ గమనించాలి. ఉద్యోగులందరూ తమ ఐక్యతను ప్రభుత్వానికి చూపించాలి."-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్

భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..

ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. జీతాల బిల్లుల తయారీ కోసం ట్రెజరీ అధికారుల మెడపై కత్తి పెట్టారని ఆక్షేపించారు. ట్రెజరీ అధికారులను బెదిరిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా మెమోలు జారీ చేస్తున్నారన్నారు. ఉద్యోగులపై ఇష్టానుసారం చర్యలు తీసుకునేందుకు ఇది ఆటవిక రాజ్యం కాదని హితవు పలికారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలతో అధికారులపై చర్యలు తీసుకోవద్దని కోరారు. చర్చలకు రావాలని ఒకసారి వాట్సప్‌ మెసేజ్ మాత్రమే పంపారని..,ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారని వాపోయారు.

"జీతాల బిల్లుల తయారీ కోసం ట్రెజరీ అధికారుల మెడపై కత్తి పెట్టారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా మెమోలు జారీ చేశారు. ఉద్యోగులపై ఇష్టానుసారం చర్యలు తీసుకునేందుకు ఆటవిక రాజ్యం కాదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. చర్చలకు రావాలని ఒకసారి వాట్సప్‌ మెసేజ్ మాత్రమే పంపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారు."- సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేత

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స

ఇదిలా ఉండగా ప్రభుత్వ జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పీఆర్సీ అంశాలపై సీఎం జగన్​తో సమావేశమైన మంత్రుల కమిటీ సభ్యులు.. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కమిటీ వేశారని మంత్రి బొత్స అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించామని..,3 రోజులు గడచినా వారు చర్చలకు రాలేదన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని స్పష్టం చేశారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి

Agitations: ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ.. అమరావతి రైతుల ధర్నా

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.