Minister Satyanarayana visited Durga Temple: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి మాస్టర్ప్లాన్ అంశాలపైనా మంత్రి ఆరా తీశారు. అమ్మవారి సన్నిధిలో పారిశుధ్యం, ఇతర సదుపాయాలను పర్యవేక్షించారు.
అమ్మవారి ఆలయానికి 19 రోజులకు రెండు కోట్ల 64 లక్షల 25 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. రోజుకు సగటున 13.90 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని.. కానుకల రూపములో బంగారం 536 గ్రాములు, వెండి.. 6 కేజీల 60 గ్రాములు.. సమర్పించినట్లు వివరించారు. ఈ-హుండీ ద్వారా 80 వేల 868 సమకూరినట్లు తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొందరు అమ్మవారికి టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారాన్ని ఆలయ అధికారులు మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. 12 తులాలపైనే బంగారు ఆభరణాలను అపహరించేందుకు కొందరు ప్రయత్నించారని, ఎస్పీఎఫ్ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బయటపడిందని తెలిపారు.