SEA SAND Selling : ‘‘నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో లభించే సిలికా శాండ్ (సముద్రపు ఇసుక)ను నది ఇసుకగా చూపించి చెన్నైలో నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. వీటిని అడ్డుకోండి’’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రికి నెల్లూరు జిల్లాకు చెందిన గ్రీన్ సొసైటీ ఈ నెల 20న లేఖరాసింది. చిల్లకూరు, కోట మండలాల్లో సిలికా శాండ్ లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలపై అదే ప్రాంతానికి చెందిన కొందరు గ్రీన్ సొసైటీగా ఏర్పడి పోరాడుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ఇప్పటికే ఓ లీజులో ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు కూడా వేశారు. ఇసుక కాంట్రాక్టర్, తితిదే పాలకమండలి మాజీ సభ్యులు శేఖర్రెడ్డి మేనల్లుడు మోహన్కార్తీక్కు చెందిన వామన ఎంటర్ప్రైజెస్ ద్వారా కొంత కాలంగా పెద్ద ఎత్తున సిలికా శాండ్ చెన్నైకి తరలించి విక్రయాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న 13 లారీలు, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న 5 లారీలు కలిపి మొత్తం 18 లారీల్లో నిరంతరం నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకి సిలికాశాండ్ తరలిస్తున్నట్లు వివరించారు. ఆరంబాక్కం వద్ద ఓ పెట్రోల్ బంకు వెనుక వైపు ఈ ఇసుకను నిల్వచేసి, అక్కడి నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇసుకతో నిర్మాణాలు చేపడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతుందన్నారు. ఈ ఇసుక అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు బేఖాతరు..
చిల్లకూరు, కోట మండలాల్లోని పలు లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ గ్రీన్ సొసైటీ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీకి ఫిర్యాదు చేసింది. తమ్మినపట్నంలోని ఏపీఎండీసీకి చెందిన రెండు లీజుల్లో అదనపు తవ్వకాలు చేస్తోందని ఆరోపించారు. బల్లవోలు, మోమిడి, కొత్తపట్నంలోని ముగ్గురు లీజుదారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :విదేశీ సాయానికి కేంద్రం మెలిక.. ప్రాజెక్టులపై నీలినీడలు