ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పేదల నివాసాలను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ.. సీపీఐ ఆందోళన

By

Published : Jun 3, 2022, 2:18 PM IST

CPI Protest: కడప ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పేదల నివాసాలను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నేతలు నిరసనకు దిగారు. తహశీల్దార్‌ శివరామ్‌రెడ్డిని బాధితులు చుట్టుముట్టారు. 'ఎమ్మార్వో డౌన్​డౌన్' అంటూ నినాదాలు చేశారు. కడప నగరంలో పెద్దల నివాసాల జోలికి వెళ్లకుండా 30 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల నివాసాల జోలికి రావడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Protest
సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన

CPI Protest : కడప నగరంలో ఆక్రమణల పేరిట పేదల నివాసాలను కూల్చడానికి వ్యతిరేకిస్తూ కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్డీవో కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకారులు నిరసన చేస్తుంటే... ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి అక్కడికి వచ్చారు. బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇంతలో తహశీల్దార్‌ శివరామిరెడ్డి రావడంతో.. ఒక్కసారిగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎమ్మార్వో డౌన్​డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులు ఆయనను చుట్టుముట్టారు. ఆయన ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బాధితులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆర్డీవో కార్యాలయ ఆవరణంలో కూర్చుని ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కడప నగరంలో పెద్దల నివాసాల జోలికి వెళ్లకుండా 30 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల నివాసాల జోలికి రావడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మామ అయిన రవీంద్రనాథ్​రెడ్డి థియేటర్లను కూల్చకుండా... పేదల నివాసాలను కూల్చడం సిగ్గు చేటన్నారు. కడప మేయర్ సురేష్ బాబు కాలువలను సైతం ఆక్రమించి సినిమా థియేటర్లను నిర్మించుకున్నారని వాటి జోలికి వెళ్లకపోవడం సరికాదని మండిపడ్డారు. ఆక్రమణల పేరిట పేదల నివాసాల కూల్చడాన్ని ఆపకపోతే నగరంలోని పేదలందరూ పిల్లాపాపలతో సహా ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్ష తాడేపల్లిగూడెంలో ప్యాలెస్​లో కూర్చున్న ముఖ్యమంత్రి జగన్​కి తాకుతుందని బాధితులు అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details