ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NBK Counter To YCP Leaders: అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా..?

By

Published : Nov 20, 2021, 6:03 PM IST

Balakrishna Counter To YCP Leaders

వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై మాట్లాడిన ఆయన.. వాళ్లు మాట్లాడే భాషా చూస్తుంటే.. అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా..? అన్నట్లు ఉందంటూ ధ్వజమెత్తారు. భువనేశ్వరిపై వ్యాఖ్యలు చాలా దారుణమన్నారు. ఇలాగే మాట్లాడితే చేతులు ముడ్చుకుని కూర్చోబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వాళ్ల భరతం పడతామంటూ హెచ్చరించారు.

నందమూరి బాలకృష్ణ

చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna Strong Counter To YCP Leaders news). అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను తనదైనశైలిలో దుయ్యబట్టారు. భువనేశ్వరిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అలా మాట్లాడం చాలా దురదృష్టకరమన్నారు. వాళ్ల ఆంగికం, ఆహార్యం, వాచకం చూస్తే.. అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా అన్నట్లు ఉందంటూ ఘాటుగా స్పందించారు. సమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో ఇలా మహిళలను వ్యక్తిగతంగా కించపరచటం ఏమాత్రం సరికాదన్నారు.

'రాష్ట్రాభివృద్ధికి వైకాపా వాళ్లు చేసేదేం లేదు.. దోచుకోవటం తప్ప. భువనేశ్వరి అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అసలు వాళ్ల నీచమైన భాష చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మాకే కాదు.. వాళ్ల ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారు. కొన్నింటిని పక్కదోవ పట్టించేందుకు ఇలా నీచంగా మాట్లాడుతున్నారు. హుందాగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే సభలోని స్పీకర్​.. ఏం చేస్తున్నారో అర్థంకావటం లేదు. ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహారిస్తున్నారు. ఈ సమావేశాల్లోనే కాదు.. గత సమావేశాల్లోనూ అలాగే చేశారు' - నందమూరి బాలకృష్ణ

ఇలాగే మాట్లాడితే తాము చేతులు ముడ్చుకుని కూర్చోబోమని బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతి అంశాన్నీ పక్కదోవ పట్టించటం మానుకోవాలన్నారు. వాళ్లు మారకపోతే మెడలు వంచి మార్చుతామని హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసుపై కూడా దాడికి దిగారు. ఆ సమయంలోనే మాట్లాడుదామని అనుకున్నప్పటికీ.. చంద్రబాబు సూచన మేరకు స్పందించలేదన్నారు. ఇక నిన్న జరిగిన పరిణామాలను ఉపేక్షించేది లేదనే.. ముందుకు వచ్చామని బాలకృష్ణ చెప్పారు. ఆడవాళ్లపై మాట్లాడి.. మైండ్ గేమ్ ఆడాలని చూడటం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే సహించబోమని.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..
శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు.. తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. మీడియా ఎదుటే వెక్కివెక్కి ఏడ్చేశారు(chandrababu crying news). తన భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని గద్గద స్వరంతో మాట్లాడారు. ప్రజలు వైకాపాకు 151 సీట్లు ఇచ్చి.. తమకు 23 స్థానాలు ఇచ్చినా బాధపడలేదన్నారు. ప్రతిపక్షంలో ఉండే వ్యక్తులను ఇంత చులకనగా మాట్లాడం తానేప్పుడు చూడలేదన్నారు. ఇది కౌరవ సభా....? గౌరవ సభా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

'నా భార్యకు ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, సుదీర్ఘకాలం నేను సీఎంగా ఉన్నప్పుడు గానీ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం తప్పనిసరిగా ఆమె పాల్గొనాల్సిన కార్యక్రమాలుంటే, రిక్వెస్ట్‌ చేస్తే వచ్చేవారంతే. తన పనేదో చేసుకోవడం, నలుగురికీ సాయపడటం, నన్ను ప్రోత్సహించడం తప్ప తనకు ఇంకొకటి తెలీదు. అలాంటి వ్యక్తిని అంత ఘోరంగా అవమానించడం భరించరాని విషయం. నలభై ఏళ్లు ఏ ప్రతిష్ఠ కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కష్టపడ్డామో, దానికి భంగం వాటిల్లింది. నా భార్య నాకు అన్నివిధాలా సహకరించారు. హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు నేను సచివాలయంలో ఉంటే... ఆమే ఫోన్‌ చేసి మీ బట్టలు సర్ది సూట్‌కేస్‌ పంపిస్తున్నా, వెంటనే అక్కడికి వెళ్లండని చెప్పారు' - చంద్రబాబు, తెదేపా అధినేత

కొత్తగా తనకు పదవులు, రికార్డులు అక్కర్లేదన్న చంద్రబాబు.. 'రామాయణంలో రాక్షసులు ఏం చేశారో చూశాం. దేవతల దగ్గర వరం తీసుకున్న భస్మాసురుడు ఏం చేశారో చూశాం. గతంలో తరిమెల నాగిరెడ్డి, ఎన్టీ రామారావు తాము చెప్పదలచినది చెప్పి సభ నుంచి బయటకు వచ్చారు. నేను కూడా క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతా. ఈ ధర్మపోరాటంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా' అని కోరారు.

అనుబంధ కథనాలు:

ABOUT THE AUTHOR

...view details