Junior NTR: ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది..: జూనియర్ ఎన్టీఆర్

author img

By

Published : Nov 20, 2021, 3:47 PM IST

Updated : Nov 20, 2021, 4:26 PM IST

Junior NTR

15:43 November 20

వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు: జూనియర్ ఎన్టీఆర్‌

జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు(junior ntr react on ycp leaders comments against chandrababu news). శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందన్నారు.  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని జూనియర్ ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాందని వ్యాఖ్యానించారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని.. వాటిని భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలన్నారు. కుమారుడు, భర్త, తండ్రిగా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ట్విటర్ వేదికగా వీడియో సందేశంలో తెలిపారు.

'నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన.. నా మనసును కలిచివేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు.  ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు జాగ్రత్తగా అప్పగించాలి' -   జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంపై సినీ నటులు నందమూరి కల్యాణ్‌రామ్‌, నారా రోహిత్‌ కూడా స్పందించారు.  వాక్‌ స్వాతంత్య్ర  హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

భరతం పడతారు - నారా రోహిత్ 

‘‘ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనుక ఉండి ఆడిస్తోన్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం’’ అని నారారోహిత్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'

Last Updated :Nov 20, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.