Language problem with English medium in AP: 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(NCERT) దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన అధ్యయనాల ఫలితాలతో వార్షిక నివేదిక రూపొందించింది. పరిశోధనలో భాగంగా...ఉపాధ్యాయులు సైన్సు పాఠ్యాంశాల బోధన, విషయ పరిజ్ఞానాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారో పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్లో అధ్యయనం నిర్వహించింది. మూడు జిల్లాల్లో 30 మంది ఉపాధ్యాయులను నమూనాగా ఎంపిక చేసుకుంది. బోధనసమయంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో దగ్గర నుంచి పరిశీలించింది. ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏం నేర్పాలి? ఏం నేర్చుకుంటున్నారనే విషయాల్లోతోపాటు అభ్యసన మదింపులోనూ స్పష్టత లోపించిందని(ఎన్సీఈఆర్టీ)తెలిపింది. విద్యార్థులు కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరాన్ని బోధన సమయంలో ఉపాధ్యాయులు చెప్పడం లేదని పేర్కొంది.
సమన్వయ లోపం కనిపిస్తోంది..
ఉపాధ్యాయులు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్తున్నారని.. కాన్సెప్ట్ యాక్టివిటీ అమల్లోకి వచ్చినా వారు సరిగా అర్థం చేసుకోవడం లేదని పేర్కొంది. చాలామంది బోధన పద్ధతులు, కంటెంట్ నడుమ సమన్వయ లోపం కనిపిస్తోందనివివరించింది.బోధనకు, ప్రణాళికకు మధ్య అంతరాలు ఉంటున్నాయని తెలిపింది.చాలా మంది ఉపాధ్యాయలు.. తాము చెప్పే పాఠాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారని భావించి, తమ కృషిని అంతటితో అపేస్తున్నారని వెల్లడించింది. ఉన్నతాధికారుల నుంచి పరీక్షల ఫలితాల ఒత్తిడి కష్టమైన పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యం, వనరుల కొరత, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారని జాతీయ విద్యామండలి తెలిపింది.