ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ED Raids In Hyderabad: దిల్లీ మద్యం ముడుపులపై హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

By

Published : Sep 20, 2022, 10:46 AM IST

ED Raids In Hyderabad: దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల వరుస సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా కరీంనగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును సోమవారం ఏడు గంటలపాటు విచారించారు. లిక్కర్ స్కాం నుంచి మొదలై.. నగదు లావాదేవీలు, కోట్ల రూపాయల సొమ్ము సమకూరిన విధానంపై అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో మరికొంత మందిని కూడా ఈడీ విచారించే అవకాశం కనిపిస్తోంది.

ED Raids In Hyderabad
ఈడీ అధికారుల వరుస సోదాలు

ఈడీ అధికారుల వరుస సోదాలు

ED Raids In Hyderabad: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగాఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ED Raids In Hyderabad updates : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వెన్నమనేని ఇల్లు, కార్యాలయంతో పాటు రామంతాపూర్, మాదాపూర్‌లలోని ఐటీ సంస్థల్లోనూ ఈ సోదాలు జరిగాయి. గత శుక్రవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన వాటిలో హైదరాబాద్‌ దోమల్‌గూడాలోని గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయం ఉంది. దిల్లీ మద్యం సరఫరాకు కాంట్రాక్టు దక్కించుకున్న హైదరాబాద్‌ సంస్థలకు గోరంట్ల అసోసియేట్స్‌ ఆడిటింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ED Raids In Delhi Liquor Scam : అందుకే అక్కడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్దఎత్తున దస్త్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించినప్పుడు దిల్లీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల్లోకి జరిగిన నిధుల ప్రవాహానికి సంబంధించిన వివరాలు లభించాయని.. వీటి ఆధారంగానే సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వెన్నమనేని శ్రీనివాసరావును తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన వెన్నమనేని శ్రీనివాసరావుకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లో గ్రానైట్‌ వ్యాపారంతోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఇసుక క్వారీలలోనూ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో నిందితునిగా పేర్కొన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై డైరెక్టర్‌గా ఉన్న రాబిన్‌ డిస్టిలరీస్‌ సంస్థలో సహ డైరెక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ గండ్రకు.. శ్రీనివాసరావు బావ వరుస అవుతారని తెలుస్తోంది. దీన్నిబట్టి అంచెలంచెలుగా కిందిస్థాయి నుంచి డబ్బు దిల్లీ మద్యం కాంట్రాక్టుల వరకూ వెళ్లిందన్న అంచనాకు వచ్చారు. వారి వెనుక ఎవరున్నారన్నది తేల్చేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తాజా సోదాల నేపథ్యంలో మద్యం ముడుపుల కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. పెట్టుబడులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఎక్కడికి చేరుకున్నాయో తెలుసుకోవడంలో ఈడీ అధికారులు సఫలమయ్యారని, త్వరలోనే మరికొందరు ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details