ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం పనులకు కరోనా అడ్డు

By

Published : May 18, 2020, 9:42 AM IST

Updated : May 18, 2020, 10:08 AM IST

కరోనా కలవరంతో కూలీలంతా స్వస్థలాలకు వెళ్లిపోవటంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఉన్న కొద్దిపాటి కూలీలలతో పనులు చేయిస్తున్నా అనుకున్న సమయానికి పోలవరం పూర్తవటం కష్టమే.

corona effect on polavaram project
పోలవరం ప్రాజెక్టుపై కరోనా ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కరోనా కష్టమొచ్చింది. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణ పనులు ఆగిపోయి ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా కూలీల కొరత తలెత్తింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వేలాది మంది కూలీలు తట్టాబుట్టా సర్దుకుని ఎవరి గ్రామాలకు వారు వెళ్లిపోతుండటం ఇందుకు కారణం.
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఒక్క పోలవరం, వెలిగొండ, చింతలపూడి వంటి కొన్ని ప్రాజెక్టుల్లో అక్కడక్కడా పనులు జరగడం మినహా దాదాపు అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మట్టి పనులు, కాంక్రీటు పనులూ చాలా చోట్ల చేయలేకపోయారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుల సమీక్ష - ప్రాధాన్యం పేరుతో నిర్మాణాలు నిలిపివేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఏ ప్రాజెక్టులు అవసరం? ఏది అవసరం లేదు? అన్న కోణాల్లో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి కార్యాలయ నిర్ణయం మేరకు కొలిక్కి తీసుకువచ్చారు. ఆ పనులను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినా బిల్లుల చెల్లింపు సమస్యలతో అవీ సాగలేదు.
రూ.3000 కోట్ల బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉండటంతో గుత్తేదారులు ఎవరూ పనులు చేయడానికి ముందుకు రాలేదు. తాజాగా జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ నిర్మాణాల్లో వేగం పెంచేందుకు సమీక్ష నిర్వహించగా దాదాపు రూ.3,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. గుత్తేదారులు బిల్లులు అడుగుతున్నారని చెప్పారు. అలాగే ప్రాజెక్టుల పనుల వేగం పెంచేందుకు కూలీల సమస్యా ఉందని ఇంజినీరింగు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కూలీలతో పనులు చేయించుకునేందుకు అనుమతులు ఉన్నాయని, అవసరమయితే ఆ మేరకు ఉత్తర్వులు వెలువరిస్తామని అధికారులు చెప్పారు. ఇంతలో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఒడిశాల నుంచి వచ్చి ప్రాజెక్టుల వద్ద క్యాంపులు ఏర్పాటు చేసుకుని పనిచేసే కూలీలు వెళ్లిపోయారు. దీంతో ఇప్పట్లో ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు.

పోలవరానికీ కష్టమే
పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు చేసే దాదాపు 3,000 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఉన్న కొద్ది మందితో పాటు స్థానికంగా మరో 200, 300 మందిని వినియోగించుకుని ఉన్నంతలో పనులు సాగిస్తున్నారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులూ మందకొడిగానే సాగుతున్నాయి. ఈ ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కీలకంగా ఉంటుందని ఇంజినీరింగు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఎట్టకేలకు శ్రామికులను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు ఇస్తే కరోనా కారణంగా ఉన్న కూలీలే వెళ్లిపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

ఇదీ చదవండి:ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ

Last Updated :May 18, 2020, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details