ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu: "ప్రశ్నించిన అందరిపై కేసులు పెడతారా..?"

By

Published : Aug 5, 2022, 11:17 AM IST

Chandrababu

Chandrababu: ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలి అనుకుంటే...రాష్ట్రంలోని 5 కోట్ల మందిపైనా ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెన పై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్​పై కేసు పెట్టి అరెస్టు చేయడం.. ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైకాపా క్షమాపణ చెప్పి... విద్యార్థిపైనా, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, తెదేపా నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Chandrababu: పాలనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలనుకుంటే...రాష్ట్రంలోని 5 కోట్ల మందిపైనా ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెన పై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్​పై కేసు పెట్టి అరెస్టు చేయడం.. ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని అన్నారు. కాలర్ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న ఎమ్మెల్యేలను జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని అన్నారు. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైకాపా క్షమాపణ చెప్పి... విద్యార్థిపైనా, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, తెదేపా నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరినీ విడుదల చేసి, స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ జరిగింది:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు వేపనపల్లి గ్రామానికి వచ్చారు. ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌ మూడో విడత విద్యాదీవెన డబ్బులు అందలేదని చెప్పగా, కారణమేంటో చెప్పాలని ఎమ్మెల్యే వాలంటీర్‌ను ప్రశ్నించారు. కొందరికి ఇంకా ఖాతాల్లో జమ కావాల్సి ఉందని వాలంటీర్‌ చెప్పారు. మూడేళ్లలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతుండగా, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, గ్రామానికి చెందిన మరో 8 మంది తమ వాహనాలను అడ్డుపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడికి దిగారు. పోలీసులు వారించి, విడతల వారీగా వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తెదేపా నాయకులు భారీగా స్టేషన్‌ వద్దకు చేరుకొని, యువకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వేపనపల్లి మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. వైకాపా శ్రేణులు సైతం స్టేషన్‌ ఎదుట మోహరించాయి. ఆ పార్టీ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డి కారుపై కొందరు రాళ్ల దాడి చేయడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ఎమ్మెల్యే బాబు, ఎంపీడీవో గౌరి ఇంజినీరింగ్‌ యువకుడితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ కార్యకర్తపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని తెదేపా నాయకులు ప్రతి ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details