పోలవరాన్ని జల్లెడ పడుతున్నారు!- నిషేధిత వలలతో చేపల వేటపై స్థానికుల ఆందోళన - illegal fishing
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 7:50 PM IST
Illegal Fishing At Polavaram Back Water : పోలవరం ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్స్ లో స్థానికేతరులు అక్రమంగా చేపలవేట కొనసాగిస్తున్నారు. పెద్ద ట్రాలర్లు, బోట్ల సాయంతో నిషేధించిన వలలతో నదిలో ఫిషింగ్ చేయటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం ఆ పరిసర ప్రాంతాల్లోని బ్యాక్ వాటర్స్ లో గడిచిన వారం రోజులుగా అనుమతి లేకుండా గుర్తు తెలియని కొందరు చేపల వేట కొనసాగిస్తున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిషేధిత వలల సాయంతో చిన్నచిన్న చేపల్ని సైతం వేటాడటం వల్ల ఈ ప్రాంతంలో తమ జీవనాధారం కోల్పోతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అక్రమంగా చేపలు వేటాడుతున్న స్థానికేతరులతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. దీంతో గోదావరి నది ఒడ్డున దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రెండుమూడేళ్లుగా అధికారులెవరూ ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోవటంతో గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా చేపలు వేటాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.