ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కానిస్టేబుల్ ఆత్మహత్యపై చంద్రబాబు దిగ్బ్రాంతి- పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయంటూ ఆవేదన - cbn react on SPF Constable Suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 9:22 PM IST

Chandra Babu React on SPF Constable Suicide : విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవమని తెలిపారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. మరీ ముఖ్యంగా కానిస్టేబుళ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం టీఏ, డీఏ బకాయిలు కూడా చెల్లించడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. 

పీఆర్​సీ ప్రకటనతో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అని చెప్పి మరో సారి మోసం చేశారు. నిజంగా వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను మొదట భర్తీ చేయాలని సూచించారు. అటు భర్తీ లేదు, ఇటు వీక్లీ ఆఫ్ లేదని మండిపడ్డారు. పోలీసుల విధులను నిర్వర్తించకుండా వారిని నిబంధనలకు విరుద్ధంగా తమ అవినీతికి, అరాచకాలకు సహకరించమని వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవన్నీ పోలీసులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసు సోదరులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details