ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎంపై గులకరాయి ఘటనలో బొండా ఉమను ఇరికించే కుట్ర : చంద్రబాబు - chandrababu fire on ycp government

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 7:49 PM IST

Chandra_Babu_Fire_on_YCP_Government_due_to_stone_Case

Chandra Babu Fire on YCP Government due to Stone Case : వైఎస్సార్సీపీ ఓటమి భయంతో సీఎంపై గులకరాయి ఘటనని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం నేతలపై కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఖండించారు. వైసీపీ నాయకులకు లొంగి తప్పు చేసే అధికారులూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని మండిపడ్డారు. గులకరాయి ఘటన జరిగి నాలుగు రోజులైనా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారని తప్పుపట్టారు. అనుమానితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయని తెలిపారు.

అసలు రాయి విసిరింది ఎవరు, కారణాలు ఏంటి, వాస్తవాలు ఏమిటో చెప్పకుండా నీచపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బోండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలని కోరారు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణా బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details