YSRCP leaders Concern over irregularities in assignment lands:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. అసైన్మెంట్ భూముల్లో తమకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డెక్కారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు తమ గోడు వినడం లేదని అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే, తమ అధీనంలో ఉన్న భూములను అసైన్మెంట్ కమిటీ ద్వారా రెగ్యులరైజ్ చేస్తామని నందలూరు పనిచేసిన ఎమ్మార్వో సత్యానందం హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ వర్గీయులు తెలిపారు.
అర్హులకు న్యాయం చేయాలి: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రైతుల భూములను అసైన్మెంట్ కమిటీలో ఆమోదించకుండా అధికారులు మోసం చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. నిరుపేదలైన రైతులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు కేటాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు అధికారుల తీరుపై మండిపడ్డారు. అసైన్మెంట్ కమిటీలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన రైతులకు అసైన్మెంట్ కమిటీ (Assignment Committee) ద్వారా భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున గడపగడపకు వెళ్లి ప్రచారం చేయలేమని పేర్కొన్నారు. అసైన్మెంట్ భూముల అంశంలో అధికారులు ఒక వర్గం వారికిమాత్రమే కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగా విమర్శించారు.
మోసం చేసిన సీఎం జగన్కు బుద్ధి చెప్తాం - నిరుద్యోగుల హెచ్చరిక