ETV Bharat / politics

సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 8:26 AM IST

double_votes_for_sajjala_family
double_votes_for_sajjala_family

Double votes for Sajjala family : 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' ఇది పాత సామెత! ఒకే ఇంటి నెంబర్‌తో రెండు ఓట్లు ఇది సజ్జల మాయాజాలం. ఎవరైనా ఓటుహక్కు పొందాలంటే తాము నివసిస్తున్న గ్రామం లేదా పట్టణంలో దరఖాస్తు చేసుకుంటారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అందుకు భిన్నం. ఒకే నివాసంతో రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కు పొందారు. విషయం బయటకు పొక్కడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ దొంగఓట్ల దందాకు ఇదే నిదర్శనమని తెలుగుదేశం ఆరోపిస్తోంది.

Double votes for Sajjala family : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉండటం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ట్రీ పార్కు విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని 31వ పోలింగ్‌ కేంద్రంలో క్రమ సంఖ్య 799, 800, 801, 802లో సజ్జల లక్ష్మి, రామకృష్ణారెడ్డి సజ్జల, భార్గవ సజ్జల, నవ్య మోతే కొత్తగా ఓట్లు పొందారు. అలాగే మంగళగిరి (Mangalagiri) మండలం కాజ గ్రామంలోని 132వ నంబర్‌ పోలింగ్‌బూత్‌లోనూ వరుస సంఖ్యలు 1089, 1090, 1091, 1105ల్లో ఈ నలుగురికీ ఓటుహక్కు వచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో ఇంటిసంఖ్య వద్ద A-85గా నమోదు చేసిన అధికారులు పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పేరు ఎదురుగా వారి పేర్లు నమోదు చేయడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

వేలసంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు - ఏకంగా పోలింగ్ బూత్‌లు మార్చేశారు: చంద్రబాబు

సజ్జల కోడలు నవ్య మోతేకు మాత్రం రెండుచోట్లా విల్లా A-85, రెయిన్‌ ట్రీపార్కు చిరునామాతో సహా ఓటుహక్కు కల్పించారు. చిన్న తేడాలతో రెండుచోట్ల ఓటుహక్కు పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా కొత్తగా ఓటు హక్కు (right to vote) కోసం దరఖాస్తు చేసుకుంటే వాళ్ల ఇళ్లకు యంత్రాంగం వెళ్లి విచారణ చేసిన తరువాత ఓటు మంజూరు చేస్తారు. సజ్జల కుటుంబం విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ఓటుహక్కు ఇచ్చారా? లేదా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున వారిని అడగకుండానే ఓట్లు నమోదుచేశారా? అన్నది తేలాల్సి ఉంది.

అవిగో ఎన్నికలు - ఇవిగో దొంగ ఓట్లు 'సమయం దగ్గరపడుతున్నా ఓటర్ల జాబితాలో తప్పులు'

రాష్ట్రంలో చాలాచోట్ల వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉరవకొండ, పర్చూరు, తిరుపతి నియోజకవర్గాల్లో వైకాపా నేతలు అధికారుల సహకారంతో తప్పుడు ఫారం-7లు పెట్టడం, ఇతర ప్రాంతాల ఓటర్లను చేర్చడం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల జాబితాల్లో తప్పులు చోటుచేసుకున్నాయి. విచారణలో తప్పులు గుర్తించడంతో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సజ్జల వ్యవహారం చూస్తుంటే కొత్త ఓటర్ల నమోదులో పారదర్శకతపై పలు అనుమానాలు బలపడుతున్నాయి.

డూప్లికేట్, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు

సజ్జల రామకృష్ణారెడ్డికి రెండుచోట ఓటు హక్కు ఉన్న విషయంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో సజ్జలకు ఓటుందని ఆధారాల్ని బయటపెట్టారు. క్యాంప్ ఆఫీస్ (Camp Office) క్లర్క్ రెండు ఓట్లతో రెడ్ హ్యాడెండ్ గా దొరికారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పొన్నూరులో ఒక ఓటు, మంగళగిరిలో మరో ఓటు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పెదకాకాని తహసీల్దార్‌ రత్నంను వివరణ కోరగా సజ్జల కుటుంబం కొత్త ఓట్ల కోసం పొరపాటుగా నంబూరు గ్రామంలో దరఖాస్తు చేసుకుని ఓటు పొందారని చెప్పారు. దీనిని గుర్తించి నలుగురి ఓట్లు తొలగించటానికి వెంటనే ఫారం-7 పెట్టామని రాబోయే ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఉండవని తెలిపారు. అయితే సజ్జల కుటుంబం నంబూరు గ్రామంలో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోగా బీఎల్‌వో గుర్తించి ఈ ఓట్లు మంగళగిరి నియోజకవర్గానికి చెందినవని రిమార్కు నమోదు చేసినట్లు తెలిసింది. ఏఈఆర్వో, ఈఆర్వో కూడా ఆమోదం తెలపడంతో ఓటుహక్కు మంజూరైంది. విషయం వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చర్యలకు అధికారులు ఉపక్రమించారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో దొంగ ఓట్లు - పోలీసులపై సస్పెన్షన్​ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.