ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అందరికీ మేలు చేసేలా కూటమి మ్యానిఫెస్టో - బంగారు భవితకు బాటలు వేస్తాం: పవన్‌ - Pawan Kalyan election campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 9:34 AM IST

Pawan Kalyan Election Campaign: రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైఎస్సార్సీపీను అధఃపాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజలను హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్‌, అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో హామీ ఇచ్చారు.

PAWAN_KALYAN_VARAHI_VIJAYABHERI
PAWAN_KALYAN_VARAHI_VIJAYABHERI (ETV Bharat)

అందరికీ మేలు చేసేలా కూటమి మ్యానిఫెస్టో - బంగారు భవితకు బాటలు వేస్తాం: పవన్‌ (ETV Bharat)

Pawan Kalyan Election Campaign: జగన్‌కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసని, భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్‌ విమర్శించారు. కనీసం నీడనిచ్చే వేప చెట్టునైనా పెంచే మానసిక స్థితి జగన్‌కు లేదని విశాఖలో నిర్వహించిన ఎన్నికల సభలో దుయ్యబట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వారాహి విజయభేరి (VARAHI VIJAYABHERI) యాత్రలో పవన్ పాల్గొన్నారు. జగన్​ను నమ్మి అందలమెక్కిస్తే నిలువునా ముంచేశారని విమర్శించారు. ఇప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచించడమని, తాను పనిచేస్తా, అందరి చేత పనిచేయిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బలమైన, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మన తలరాతలను మనమే రాసుకోవాలని, దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు. మరోమారు జగన్‌ను ప్రజలు కోరుకోవట్లేదని పేర్కొన్నారు. జనసేన కోసం కాదని, ఐదు కోట్ల ప్రజల కోసం తాను ఆలోచిస్తానని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకుని ప్రజల్ని పెంచానన్న పవన్, కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనమవుతామని అన్నారు. ఉత్తరాంధ్రను క్రీడల రాజధానిగా తయారు చేస్తామని, పంజాబ్‌ తర్వాత ఏపీని క్రీడా రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు.

రంగుల పిచ్చితో చేసిన ఖర్చుతో ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Yatra

30 వేల ఆడపిల్లలు అదృశ్యమైతే ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు. ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకని నిలదీశారు. ఆడబిడ్డలు, ప్రజల ఆస్తుల జోలికి వెళితే మోకాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ గూండాల మోకాళ్లు విరగ్గొట్టి జగదాంబ సెంటర్‌లో కూర్చోబెడతామన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజలను భయపెడుతున్నారన్న పవన్‌, వైఎస్సార్సీపీని తుంగలో తొక్కుతామని అన్నారు.

ప్రాణాలకు తెగించకపోతే ఫ్యాక్షన్‌ ముఠాలను ఎదుర్కోలేమన్న పవన్‌, భయం గుప్పిట్లో సమాజం ఉండటం తనకిష్టం లేదని తెలిపారు. భద్రత, స్వేచ్ఛ లేకుంటే ఎంత డబ్బున్నా వృథా అని, ఇక్కడే కొట్లాడి ధైర్యంగా నిలబడాలే కానీ పారిపోవద్దని పేర్కొన్నారు. మార్పు కోసం అందరూ కలిసికట్టుగా నిలబడాలని, నేల కోసం నిలబడాలని, మీకోసం మీరు నిలబడాలని పవన్‌ పిలుపునిచ్చారు.

మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పవన్‌ హెచ్చరించారు. ఓట్ల బలంతో జగన్‌ను తుంగలో తొక్కేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్న పవన్ ఓ పాట రూపంలో వైఎస్సార్సీపీ పాలనను ఎద్దేవా చేశారు. ఆర్థిక రాజధానితో పాటు విశాఖను స్పోర్ట్‌ క్యాపిటల్‌గా మారుస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌కు ఆయన అభిమానులు చేపలు అందించారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారు- కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Bus Yatra

ABOUT THE AUTHOR

...view details