CM Jagan Family Member Irregularities in YSR District:వైఎస్సార్ జిల్లాను తమకు రాసిచ్చామనుకున్నారో లేక అది తమ సొంతమనుకున్నారో కానీ అక్కడి వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము ఎంత చేస్తే అంత అడిగే వారూ ఎదురు చెప్పేవారూ లేరనే ధీమాతో పాల్పడని అక్రమాలు లేవు చేయని కబ్జా లేదు. కడప సమీపాన ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిగా, దగ్గరి బంధువైన పెద్దల అండతో జిల్లాలో దందా సాగిస్తున్నారు. ఆయన కబ్జా చేసిన భూములే వేల కోట్ల విలువ చేస్తాయంటారు. ఆక్రమించిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే స్థిరాస్తి వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు.
చిన్నాచితకా పనులైనా సరే వాళ్లే చేయాలి. కార్యకర్తల్నీ దగ్గరకు రానివ్వరు. సర్వారాయ ప్రాజెక్టుపై సర్వహక్కులూ తమవే అన్నట్లుగా ఆ నీటిని ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ చేపల పెంపకం సాగిస్తున్నారు. ఏదైనా భూమిపై ఆయన కన్నుపడితే ఇక అంతే దానికి వివాదాలు సృష్టించి మరీ పంచాయితీ నిర్వహిస్తారు. ఆ పేరిట భారీగా ముడుపులు తీసుకుంటారు. వైసీపీ నేతలే ఆ ప్రజాప్రతినిధికి భయపడి పార్టీని వీడుతున్నారంటే ఆయన అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వేలకోట్ల భుములు కబ్జా:
- బినామీ పేర్లతో కడప నగరంలో బుద్ధా టౌన్షిప్ పేరిట అనధికారిక వెంచర్లును ఆ ప్రజాప్రతినిధి వేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకుని దందా సాగించారు.
- కడప నగర శివారులో ఓ విద్యాసంస్థకు ఇచ్చిన 200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. తన అనుచరుడ్ని బినామీగా పెట్టి అందులో సెంటు 13లక్షల చొప్పున విక్రయించారు. ఇలా మొత్తం 400 కోట్లకు పైగా దోచుకున్నారు.
- సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.
- వల్లూరు మండలం గోటూరు వద్ద 100 కోట్ల విలువైన పీర్లమాణ్యం భూములతో పాటు కడప నగరంలోని మామిళ్లపల్లె రెవెన్యూ సర్వే నంబరు 39, 60లో సుమారు 130 కోట్లు విలువ చేసే 18 ఎకరాలను కబ్జా చేశారు.
- వల్లూరు రెవెన్యూ కార్యాలయం సమీపంలో 7 కోట్లు విలువ చేసే భూములు, కడప నగరంలోని జయరాజ్ గార్డెన్ వద్ద పేదలను బెదిరించి 130 కోట్ల విలువ చేసే 18 ఎకరాలను ఆ ప్రజాప్రతినిధి స్వాహా చేశారు.
- పెండ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో బినామీల పేర్లతో 200 ఎకరాలను ఆక్రమించారు. బుగ్గవంకను చెరబట్టి అందులో సినిమా హాలు నిర్మించారు. కడప, కమలాపురంలో చుక్కల భూముల పేరిట రైతుల్ని వేధించి కబ్జా చేసేస్తున్నారు.
సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం
కొడుకు పేరుతో భుములకు ఎసరు: ఆ ప్రజాప్రతినిధి తన కుమారుడి పేరిట సత్యసాయి జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములకు ఎసరు పెట్టారు. తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసేందుకు యత్నించగా ఈ తతంగం వెలుగులోకి రావడంతో మిన్నకుండిపోయారు. వల్లూరు మండలం గోటూరు వంతెన వద్ద 9 ఎకరాల వక్ఫ్ భూమిని తమ పార్టీకి చెందిన ఎంపీ బంధువుకు విక్రయించే ప్రయత్నం చేయగా రిజిస్ట్రేషన్ సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అయినా ఆ ప్రజాప్రతినిధి మాత్రం తాను తీసుకున్న 2కోట్ల అడ్వాన్స్ను తిరిగి ఇవ్వలేదు. కడపలోని మెడికల్ కళాశాల వద్ద మైనార్టీ భూములను ఆయన పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని టౌన్షిప్ పేరిట లేఅవుట్ వేశారు.
ఏదైనా భూమిపై తన కన్ను పడిందంటే ముందు వాటిని 22A నిషేధిత జాబితాలో పెట్టించడం ఆ ప్రజాప్రతినిధి ఎత్తుగడ. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల్ని అడ్డంపెట్టుకుని కథ నడిపిస్తారు. పంచాయితీ పేరుతో వాటిని తనకు విక్రయించాలని నిబంధన పెడతారు. అసలు విలువలో 20 శాతానికి ఎక్కువకాకుండా ధర నిర్ణయించి సంతకాలు పెట్టించుకుంటారు. ఇటీవల జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. సీకేదిన్నె మండలం పబ్బాపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు 9 కోట్ల విలువైన పొలాలున్నాయి. వాటిపై కన్నేసిన ప్రజాప్రతినిధి కావాలనే వివాదాలు సృష్టించారు. ఆ భూమి తనదేనంటూ మరో వ్యక్తితో నకిలీ పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేశారు.